ఉద్యోగాల పేరుతో రూ.50 లక్షల మోసం..137 మందిని నిండా ముంచిన వ్యక్తి అరెస్ట్

ఉద్యోగాల పేరుతో రూ.50 లక్షల మోసం..137 మందిని నిండా ముంచిన వ్యక్తి అరెస్ట్

జీడిమెట్ల, వెలుగు: మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి భారీగా నగదు వసూలు చేసిన ఘరానా మోసగాడిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన జక్కుల అజయ్(34) గతంలో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. కొంతకాలం కింద ఉద్యోగం కోల్పోవడంతో తన  స్నేహితులు శ్రావణి కొండాజీ, సద్గున్ సాధుల కలిసి నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ వేశారు.

ప్రముఖ కంపెనీల్లో ప్లేస్​మెంట్ ఇప్పిస్తామని నమ్మించి సుమారు 137 మంది నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేశారు. నిజాంపేటకు చెందిన కాసుల జగదీశ్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి అజమ్​ను అదుపులోకి తీసుకుని మంగళవారం రిమాండ్​కు తరలించారు.