అమీన్పూర్ లో జర్నలిస్టుపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

 అమీన్పూర్ లో జర్నలిస్టుపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు

అమీన్​పూర్, వెలుగు: న్యూస్​ కవరేజ్  కోసం వెళ్లిన అమీన్​పూర్​ మండల రిపోర్టర్​ విఠల్​పై కొందరు వ్యక్తులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. మున్సిపల్​ పరిధిలోని భవానీపురంలో  సర్వేనంబర్​630 ప్రభుత్వ భూమిలో పార్కు కోసం కేటాయించిన  స్థలంలో కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తహసీల్దార్​కు ఫిర్యాదులు వెళ్లడంతో అధికార సిబ్బందితో కలిసి తహసీల్దార్​​వెంకటేశ్​పరిశీలనకు వచ్చారు. ఈ క్రమంలో నిర్మాణం చేపట్టిన వ్యక్తులు తహసీల్దార్​తో గొడవకు దిగడంతో తోపులాటలో తహసీల్దార్​ కిందపడ్డారు. 

ఇదంతా జర్నలిస్ట్​ విఠల్​ అక్కడే ఉండి కవర్​ చేశారు. అదే రోజు రాత్రి కొంత మంది వ్యక్తులు మద్యం తాగి జర్నలిస్ట్​ విఠల్ ​ఇంటికి వచ్చి బూతులు తిడుతూ ఇంటి తలుపులు, కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు. విఠల్​ పోలీసులకు ఫోన్​ చేయగా పోలీసులు వచ్చే లోపు వారు వెళ్లిపోయారు. అనంతరం విఠల్​ ఇంటి బయటకు రాగానే దుండగులు ఎదురుపడి పోలీసులు అడ్డుకుంటున్నా విఠల్​పై దాడి చేశారు. 

ఈ దాడిలో విఠల్​కు తీవ్ర గాయాలయ్యాయి. శనివారం ఉదయం అమీన్​పూర్​ పీఎస్​లో విఠల్​ సీఐ నరేశ్​కు ఫిర్యాదు చేశారు.  దాడి చేసిన వారిలో తాను కొందరిని గుర్తించానని, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. దాడి చేసిన వారందరిని చట్ట ప్రకారం శిక్షించాలని జర్నలిస్టు సంఘాల సభ్యులు డిమాండ్​ చేశారు.