
‘అరవింద సమేత’ చిత్రం తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. నిర్మాత నాగవంశీ బుధవారం ఇందుకు సంబంధించి ఓ హింట్ ఇచ్చారు. ‘అత్యంత శక్తివంతమైన దేవుళ్లలో ఒకడిగా నా ఫేవరెట్ బ్రదర్’ అంటూ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓ శ్లోకాన్ని షేర్ చేశారు. పురాణాల్లో హిందూ యుద్ధ దేవుడుగా కీర్తించే సుబ్రహ్మణ్యస్వామి ఇతివృత్తంతో ఈ మైథలాజికల్ మూవీ తెరకెక్కబోతోంది. నిజానికి ‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నటించబోయే చిత్రం కథ ఇదేననే ప్రచారం జరిగింది. కానీ తమిళ దర్శకుడు అట్లీతో బన్నీ సినిమా చేస్తుండడంతో ఈ కాంబినేషన్ వెనక్కి వెళ్లింది. ఈలోపు వెంకటేష్, రామ్ చరణ్లతో త్రివిక్రమ్ సినిమాలు ఉండబోతున్నాయనే వార్తలొచ్చాయి.
వాటన్నింటినీ వెనక్కు నెడుతూ బుధవారం ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్పై హింట్ ఇచ్చారు నాగవంశీ. ఇప్పటికే ‘యమదొంగ’ లాంటి చిత్రాలతో పౌరాణిక పాత్రల్లోనూ మెప్పించగలనని ప్రూవ్ చేశారు ఎన్టీఆర్. దీంతో సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో ఎన్టీఆర్ నటించబోయే ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. ఇక హృతిక్ రోషన్తో కలిసి నటించిన ‘వార్ 2’ ఆగస్టులో రిలీజ్ అవుతున్న నేపథ్యంలో బుధవారం డబ్బింగ్ వర్క్ స్టార్ట్ చేశాడు ఎన్టీఆర్. మరోవైపు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ షూటింగ్లో పాల్గొంటున్నాడు. అలాగే తమిళ దర్శకుడు నెల్సన్ డైరెక్షన్లోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది.