
- 30 నుంచి జూడాల సమ్మె
పద్మారావునగర్, వెలుగు: జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె సైరన్ మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు జూడాల సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అజయ్ తెలిపారు. సమ్మెను విజయవంతం చేసేందుకు జూడాలందరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ గాంధీ దవాఖాన ఆవరణలో శనివారం సన్నాహాక సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో అజయ్ మాట్లాడారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి, ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు అందించినా ఫలితం లేదని వాపోయారు. ప్రతినెల 10 లోగా స్టైపెండ్, గ్రీన్ చానెల్ ఏర్పాటు, ఫీజు రీయింబర్స్ మెంట్, మౌలిక వసతుల కల్పన తదితర డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె నోటీసులు అందించామన్నారు.
రాష్ట్రంలోని 34 మెడికల్ కాలేజీల్లో విధులు నిర్వహిస్తున్న అండర్, పోస్టు గ్రాడ్యుయేట్స్, హౌస్సర్జన్లు, సీనియర్ రెసిడెంట్స్ అందరూ సమ్మెలో పాల్గొని కోరారు. ఈ సమావేశంలో జూడాల సంఘం ప్రతినిధులు డాక్టర్ గిరిప్రసాద్, సందీప్, వినయ్, మహాలక్ష్మీ పాల్గొన్నారు.