- ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే ఎన్డీయే సర్కార్ కూలుతుంది
మోతిహీరి: హర్యానాలో ఓట్ల చోరీకి పాల్పడ్డట్టు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చోరీకి పాల్పడాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి కుట్రలు చేస్తున్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఆరోపించారు. ‘‘రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య హక్కులను కాలరాసేలా బీజేపీ, ఈసీ కలిసి పనిచేస్తున్నాయి. హర్యానాలో ఓట్లను ఎలా చోరీ చేశారో.. అదేవిధంగా బిహార్లోనూ 65 లక్షల ఓట్లను తొలగించారు. దీని ద్వారా ఓట్ల చోరీకి వారు రెడీ అయ్యారు” అని ఆమె దుయ్యబట్టారు.
బిహార్లోని సీతామఢి, ఈస్ట్ చంపారన్లో గురువారం ఎన్నికల ప్రచారంలో ప్రియాంక మాట్లాడారు. ‘‘రాహుల్గాంధీ పోరాటం జనం కోసం. మహాత్మాగాంధీ స్ఫూర్తిగా ఆయన ముందుకు సాగుతున్నారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్నవారిని జనం ముందు ఎండగడుతున్నారు” అని తెలిపారు.
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నవాళ్లను, ద్రోహులను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని బీజేపీని హెచ్చరించారు. ‘‘బిహార్ అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతం జరిగితే ఎన్డీయే సర్కార్ కూలిపోతుంది. అందుకే వాళ్లు కుట్రలు పన్నుతున్నారు. కుట్రలను పేదలు, మహిళలు, యువత కలిసి తిప్పికొట్టాలి” అని ఆమె సూచించారు.
