
- శాంతి చర్చల కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్
- కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మానవ హక్కుల వేదిక సదస్సు
జమ్మికుంట, వెలుగు: ఆయుధం కింద పెడ్తామన్న వాళ్లను కాల్చేయడం ధర్మం కాదని, మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని శాంతి చర్చల కమిటీ చైర్మన్, హైకోర్ట్ రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి చర్చల ఆవశ్యకతపై మానవ హక్కుల వేదిక రాష్ట్ర బాధ్యుడు తిరుపతయ్య ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ద్వారా ప్రతి ఒక్కరికి జీవించే హక్కు కల్పించడం జరిగిందని, నేడు ఆ హక్కు ఆదివాసీ ప్రాంతాల్లో ఉపయోగపడడం లేదన్నారు. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఆదివాసీ ప్రాంతాల్లో శాంతి నెలకొల్పాలని, ఇరువర్గాల మధ్య యుద్ధ వాతావరణం నివారించాలని కోరారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు ప్రతి ఒక్కరికి జీవించే హక్కును ఎందుకు కల్పించడం లేదని ప్రశ్నించారు. పాలకులలో నిజాయితీ లోపించిందని, కాంట్రాక్టర్ల సంపాదన కోసమే ప్రభుత్వాలు నడిపుతున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. మావోయిస్టులు నెల రోజుల కింద శాంతి చర్చల కోసం సిద్ధంగా ఉన్నామని ప్రకటించినా, ప్రభుత్వం వారిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నించడం సరైంది కాదన్నారు. మావోయిస్టులు, పోలీసుల మధ్య జరుగుతున్న కాల్పుల్లో అమాయకులైన గిరిజనులు, ఆదివాసీలు, దళిత బిడ్డలు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడికి లేఖలు రాశామని, వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో చర్చలు జరపాలని కోరారు. శాంతి చర్చల ఆవశ్యకతను వివరించేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, గుంటి సామ్రాజ్యం, పింగిలి రమేశ్, వాసుదేవారెడ్డి, దేశిని కోటి, పోడేటి రామస్వామి, నరహరి, సదయ్య, పుల్లూరి సంపత్ రావు, శిరీష, పొన్నగంటి సంపత్ పాల్గొన్నారు.