
ఇబ్రహీంపట్నం, వెలుగు: కోతుల దాడిలో గాయపడిన అంగన్వాడీ టీచర్, హెల్పర్కు న్యాయం చేయాలని, సెలవురోజుల్లోనూ పనులు చెప్పిన సీడీపీవోను సస్సెండ్ చేయాలంటూ అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీవో) ఆఫీసును ముట్టడించారు. కోతుల దాడిలో గాయపడిన బాధితులతో కలిసి ధర్నా చేశారు.
అనంతరం సీడీపీవో ఆఫీసులో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ.. మండలంలోని రాయపోల్ అంగన్ వాడీ సెంటర్ –4ను ఆదివారం సీడీపీవో ఆదేశాలతో టీచర్ భారతమ్మ, హెల్పర్ తాహెరబేగం తెరిచారని.. అక్కడ కోతులు వారిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయన్నారు. స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారన్నారు. సీపీడీవోను సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అంగన్ వాడీ యూనియన్ నేతలు వైదేహి తదితరులు పాల్గొన్నారు.