కే. విశ్వనాథ్ భార్య జయలక్ష్మి కన్నుమూత

కే. విశ్వనాథ్ భార్య జయలక్ష్మి కన్నుమూత

కళా తపస్వి కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మి (88) గుండెపోటుతో మరణించారు. ఆదివారం సాయంత్రం 6.15కు జయలక్ష్మి చనిపోయినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు.  సోమవారం మధ్యాహ్నం పంజాగుట్ట స్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. కే. విశ్వనాథ్ లాగే  ఆయన సతీమణి జయలక్ష్మి నిద్రలోనే మరణించారని సమాచారం. కే.విశ్వనాథ్ కన్నుమూసి కనీసం నెలరోజులైనా గడవకముందే ఆయన సతీమణి మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కే. విశ్వనాథ్, జయలక్ష్మి  దంపతులకు ముగ్గురు సంతానం. అమ్మాయి పద్మావతి దేవి, అబ్బాయిలు కాశీనాథుని నాగేంద్రనాథ్, కాశీనాథుని రవీంద్రనాథ్. విశ్వనాథ్ స్వస్థలం గుంటూరు జిల్లాలోని రేపల్లె. ఫిబ్రవరి 19, 1930లో జన్మించారు. ఆయన పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ్. గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్, ఆంధ్రా క్రిస్టియన్ కాలేజీలో బీఎస్సీ చదివారు. తండ్రి కాశీనాథుని సుబ్రహ్మణ్యం మద్రాసులోని వాహిని స్టూడియోస్ లో పని చేసేవారు. డిగ్రీ పూర్తయ్యాక విశ్వనాథ్ కూడా అందులో ఉద్యోగానికి వెళ్లారు. 

ఆత్మ గౌరవం మూవీతో దర్శకుడిగా మారిన విశ్వనాథ్..తొలి చిత్రంతో నంది పురస్కారాల్లో ఉత్తమ సినిమా విభాగంలో కాంస్య బహుమతి అందుకున్నారు. ఆ కథకు కూడా నంది అవార్డు దక్కింది. ఆ తర్వాత విశ్వనాథ్ చెల్లెలి కాపురం,శారదా,ఓ సీత కథ, జీవన జ్యోతి సినిమాలు ఉత్తమ సినిమాలుగా నంది అవార్డులను అందుకున్నాయి. శంకరాభరణం సినిమాకు  నంది అవార్డు మాత్రమే కాదు..బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ఫర్ ప్రోవైడింగ్ హోల్ సమ్ ఎంటర్టైన్మెంట్  విభాగంలో జాతీయ అవార్డు దక్కింది. సప్తపది, స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం వంటి మూవీలకు జాతీయ అవార్డులు లభించాయి. తెలుగుతో పాటు హిందీ సినిమాలకూ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. శుభ సంకల్పం సినిమాతో నటుడిగా మారిన ఆయన.. పలు చిత్రాల్లో నటించారు. ఎనిమిది సార్లు ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్న విశ్వనాథ్ ను...భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 1994లో జీవిత సాఫల్య పురస్కారంతో ఫిల్మ్ ఫేర్ సన్మానించింది.