- ఫిరాయింపుల కేసులో స్పీకర్ ముందు విచారణకు కడియం హాజరు
హైదరాబాద్, వెలుగు: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై విచారణ సోమవారానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ వేసిన అనర్హత పిటిషన్పై శనివారం కడియం శ్రీహరి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేకానంద్ తరఫు అడ్వకేట్లు కడియంను క్రాస్ ఎగ్జామిన్ చేశారు.
మీడియాలో వచ్చిన ఆధారాలను స్పీకర్ సమక్షంలో శ్రీహరికి చూపిస్తూ పార్టీ మారినట్లుగా అడ్వకేట్లు ప్రశ్నించగా, అది తప్పు అని, ఆ ఫొటోలు ఏఐ అని విచారణ సందర్భంగా కడియం అన్నట్లు తెలిసింది.
బయట తొడలు కొట్టుడు.. లోపల పిల్లిగంతులేసుడు: కేపీ వివేకానంద్
బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన కడియం వింత పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, బయట ఆయన తొడ కొడుతున్నా.. లోపల పిల్లి గంతులు వేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. ఆయన బయటకొచ్చి కేసీఆర్ను తిడుతున్నారన్నారు. అసెంబ్లీలో కడియం విచారణ అనంతరం మీడియాతో వివేకానంద్ మాట్లాడారు.
