హోరాహోరీగా ‘కాకా’ క్రికెట్ టోర్నీ

హోరాహోరీగా ‘కాకా’ క్రికెట్ టోర్నీ
  • వరంగల్​పై నిజామాబాద్‌‌, మహబూబ్​నగర్​పై రంగారెడ్డి గెలుపు

గోదావరిఖని, వెలుగు: హైదరాబాద్  క్రికెట్ అసోసియేషన్‌‌  సహకారంతో కొనసాగుతున్న కాకా మెమోరియల్  క్రికెట్‌‌  లీగ్  పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. రామగుండం ఎన్టీపీసీలోని మహాత్మాగాంధీ స్టేడియంలో జరిగిన రెండు రోజుల పోటీలు సోమవారం ముగిసాయి. రెండో రోజు పోటీలను ఐఎన్టీయూసీ నేషనల్​ సీనియర్​ సెక్రెటరీ, ఎన్బీసీ మెంబర్​ బాబర్​ సలీం పాషా ప్రారంభించారు.

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు మంత్రి వివేక్​ వెంకటస్వామి అండగా నిలుస్తున్నారని, ఇందులోభాగంగానే ఐపీఎల్​ను తలపించేలా అన్ని జిల్లాల్లో కాకా మెమోరియల్​ క్రికెట్​ లీగ్​ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. సోమవారం ఉదయం నిజామాబాద్, వరంగల్​ జట్ల మధ్య మ్యాచ్​ జరిగింది. 

మెదట బ్యాటింగ్​ చేసిన నిజామాబాద్​ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​ చేసిన వరంగల్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులకే పరిమితమైంది. 65 పరుగులు చేసి 9 వికెట్లు తీసిన సాయి ప్రతీక్​కు  మ్యాన్  ఆఫ్  ది మ్యాచ్  అవార్డు దక్కింది. మధ్యాహ్నం మహబూబ్​నగర్, రంగారెడ్డి జట్లు తలపడ్డాయి. 

ముందుగా బ్యాటింగ్​ చేసిన మహబూబ్​నగర్​ జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన రంగారెడ్డి జట్టు 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసి గెలిచింది. 

32 బంతుల్లో 4 సిక్స్​లు, మూడు ఫోర్లతో 54 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రంగారెడ్డి క్రీడాకారుడు పెద్ది సాత్విక్ కు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు దక్కింది. బాబర్​ సలీం పాషా, ఎన్టీపీసీ డీజీఎం జితేందర్​ కుమార్, ఆఫీసర్లు ప్రజ్ఞ, ఆయుషా, లీడర్లు భూమల్ల చందర్, జావెద్, సీనియర్​ క్రికెటర్లు కిరణ్, సుధేశ్​​ పాల్గొన్నారు.