సాయి పల్లవి, అనిరుధ్, ఎస్.జె. సూర్యకు అరుదైన గౌరవం.. 'కలైమామణి' అవార్డులు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం!

సాయి పల్లవి, అనిరుధ్, ఎస్.జె. సూర్యకు అరుదైన గౌరవం.. 'కలైమామణి' అవార్డులు ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం!

తమిళనాడులో  అత్యున్నత పౌర పురస్కారంగా భావించే 'కలైమామణి' (Kalaimamani Awards) అవార్డులను ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. గత మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 2021, 2022, 2023 సంవత్సరాలకు గాను ఒకేసారి ఈ అవార్డు గ్రహీతల జాబితాను విడుదల చేసింది.  సినీ, కళా, సాహిత్య రంగాల్లో కృషి చేసిన ప్రముఖులను గుర్తించి ఈ అవార్డులతో గౌరవిస్తారు. 

తమిళనాడు ప్రభుత్వం ప్రకటించిన ఈ అత్యున్నత పురస్కారాల జాబితాలో కోలీవుడ్ సినీ ప్రముఖులు సాయి పల్లవి, ఎస్.జె. సూర్య, అనిరుధ్ రవిచందర్, విక్రమ్ ప్రభు వంటి స్టార్స్ ఉండడం విశేషం. సాహిత్యం, సంగీతం, నాటకం, నృత్యం, సినిమా వంటి వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన 90 మంది కళాకారులకు ఈసారి కలైమామణి అవార్డులు దక్కాయి.

అవార్డు గ్రహీతలు వీరే:

సంవత్సరం    అవార్డు గ్రహీతలు

2021  -  నటి సాయి పల్లవి, దర్శకుడు, -నటుడు ఎస్.జె. సూర్య, దర్శకుడు ఎన్. లింగుసామి, రచయిత కె. తిరునావుక్కరసు, కవి నెల్లై జయంత.
2022  -  నటుడు విక్రమ్ ప్రభు, రచయిత్రి శాంతకుమారి శివకాదచ్చం.
2023  -  సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్, నటులు కె. మణికందన్, ఎం. జార్జ్ మారియన్, నేపథ్య గాయని శ్వేతా మోహన్, కొరియోగ్రాఫర్ శాండీ.

వీరితో పాటు సాహిత్యం, నాటక రంగాలకు చెందిన అనేక మంది ప్రతిభావంతులు ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

జాతీయ పురస్కారాల విభాగంలో  నేపథ్య గాయకుడు కె.జె. ఏసుదాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. కలైమామణి అవార్డులతో పాటు, జాతీయ స్థాయిలో కళారంగంలో విశేష కృషి చేసిన కొందరిని ప్రత్యేక పురస్కారాలతో సత్కరించనున్నారు. ఈ విభాగంలో ప్రొఫెసర్ ఎన్. మురుగేశ పాండియన్ కు భారతీయార్ పురస్కారం లభించింది. ప్రముఖ నేపథ్య గాయకుడు కె.జె. ఏసుదాస్‌ను ఎం.ఎస్. సుబ్బులక్ష్మి పురస్కారం వరించింది. ముత్తుకన్నమ్మాళ్ కు బాలసరస్వతి పురస్కారం ప్రకటించారు.

►ALSO READ | Ghaati OTT Release: OTTలోకి అనుష్క 'ఘాటి'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

కలైమామణి అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా బంగారు పతకం (గోల్డ్ మెడల్), ఒక షీల్డ్ బహూకరిస్తారు. ఇక, జాతీయ స్థాయి పురస్కారాలు అందుకునే వారికి లక్ష రూపాయల  నగదు బహుమతితో పాటు బంగారు పతకాన్ని అందజేయనున్నారు.

అత్యున్నత కళా గౌరవం

తమిళనాడులో కళాకారులకు దక్కే అత్యున్నత గౌరవంగా ఈ అవార్డును పరిగణిస్తారు. 1954లో తమిళనాడు ఈశై నాటక మండలి ద్వారా ఈ అవార్డును ప్రారంభించారు. గతంలో కమల్ హాసన్, రజనీకాంత్, ఇళయరాజా, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, వైజయంతీమాలా వంటి దిగ్గజాలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.. వచ్చే నెలలో చెన్నైలో జరగనున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ స్వయంగా ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డుల ప్రకటన కోలీవుడ్ పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.