
- హైదరాబాద్కు చేరుకున్న కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్
- అధికారులు, ప్రజాప్రతినిధులు సహా ఇప్పటిదాకా 119 మంది విచారణ
- వారి స్టేట్మెంట్ల ఆధారంగా న్యాయ సమస్యలు రాకుండా రిపోర్ట్ తయారీ
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ రిపోర్టుకు సర్వం సిద్ధమైంది. రెండు మూడు రోజుల్లో రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆదివారం హైదరాబాద్కు చేరుకున్నారు.
కాళేశ్వరం కుంగిన ఘటనపై నిరుడు మార్చిలో జ్యుడీషియల్ కమిషన్ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. జూన్ నుంచి దాదాపు ఏడాది పాటు సుదీర్ఘ విచారణ చేపట్టింది. అందులో భాగంగా అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన రిటైర్డ్ ఈఎన్సీలు, సీఈలు, అధికారులతో పాటు మొత్తం 119 మంది నుంచి విచారణ స్టేట్మెంట్లను తీసుకున్నది. వాళ్ల విచారణ అనంతరం ఇటీవల మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్నూ కమిషన్ విచారించి వివరాలు రాబట్టింది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా కమిషన్ తుది నివేదికను తయారు చేసింది.
జులై 31 వరకే గడువు
కమిషన్ గడువు జులై 31తో ముగియనుంది. వాస్తవానికి కమిషన్ గడువును ఇప్పటికే ప్రభుత్వం ఏడుసార్లు పొడిగించింది. అధికారులు అఫిడవిట్లు సమర్పించడం, విచారించడం ఆలస్యమైంది. వారి నుంచి సమగ్ర వివరాలను సేకరించాల్సి ఉన్నందున తొలుత అందరి నుంచి కమిషన్ అఫిడవిట్లను తీసుకున్నది. ఆ అఫిడవిట్ల ఆధారంగానే అధికారులను కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఇద్దరు ముగ్గురు అధికారులను రెండు మూడు సార్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. అంతా అయిపోతుంది.. డ్రాఫ్ట్ రిపోర్టు కూడా సిద్ధమైందనుకున్న దశలో కమిషన్ గడువును ప్రభుత్వం గత మేలో మరో రెండు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులిచ్చింది. అంతా రిపోర్టు తయారీ కోసమేనని అనుకున్నా.. చివరి నిమిషంలో కేసీఆర్, హరీశ్ రావు, ఈటల రాజేందర్ను విచారించేందుకు కమిషన్ నోటీసులు పంపింది. అందులో భాగంగా జూన్ 6న ఈటల రాజేందర్, 9న హరీశ్రావు, 11న కేసీఆర్ను విచారించింది. వారి స్టేట్మెంట్లను తీసుకున్న కమిషన్ చైర్మన్.. లీగల్ ఒపీనియన్లు తీసుకుంటూ జాగ్రత్తగా రిపోర్టును తయారు చేసినట్టు సమాచారం. ఈ రెండు మూడు రోజుల్లోనే రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు తెలుస్తున్నది.