కాళేశ్వరానికి భారీగా వరద.. గేట్లు ఎత్తివేత

కాళేశ్వరానికి భారీగా వరద.. గేట్లు ఎత్తివేత

కుండపోత వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు భారీగా చేరడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని 85 గేట్లు ఒకేసారి ఎత్తివేశారు. దీంతో ములుగు జిల్లాలోని గ్రామాలు అతలాకుతలం అవుతున్నాయి. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద నీటిమట్టం 16.730 మీటర్లకు చేరింది. దీంతో అధికారులు రెండో ప్రమాద  హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం 17.360 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు చెప్పారు. 

గోదావరి వరద ముంపు కారణంగా వెంకటాపురం, వాజేడు, ఏటూరు నాగారం మండలాల్లోని 30కి పైగా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాత్రపురం, బోధపురం, వీరబాద్రారం, ఆలుబాక,తిప్పాపురం, సురవీడు, చెరుకూరు, పేరూరు, ధర్మారం గ్రామాలకు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. దీంతో అక్కడి జనం నానా అవస్థలు పడుతున్నారు. భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారిపైకి గోదావరి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏజెన్సీ గ్రామాలకు అంధకారంలో చిక్కుకున్నాయి.