
వృక్షో రక్షతి రక్షితః’ అనే సందేశంతో పూర్తి తెలంగాణ పల్లెటూరి బ్యాక్డ్రాప్లో చిత్రీకరించిన సినిమా ‘కలివి వనం’. రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ కీలక పాత్రలు పోషించారు. హీరోయిన్గా నాగదుర్గ పరిచయమవుతోంది. రాజ్ నరేంద్ర దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ ‘పిల్లల నుంచి పెద్దల దాకా చూడాల్సిన సినిమా ఇది.
మనం వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే ఆకాశం నుంచి అని చెబుతాం. కాదు చెట్ల వల్లే వర్షం వస్తుందని నేర్పించాలి. కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య, తన 70 ఎకరాల సొంత భూమిలో మొక్కలు నాటి అడవిగా మార్చిన దుష్చర్ల సత్యనారాయణ స్ఫూర్తితోనే ఈ చిత్రాన్ని రూపొందించాను’ అని చెప్పాడు. వృక్షాల విలువను తెలియజేసే ఈ చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాం అని నటీనటులు అన్నారు. ఈ సినిమా అందర్నీ ఆలోచింపజేస్తుందని నిర్మాతలు చెప్పారు. టీమ్ అంతా పాల్గొన్నారు.