ఘనపూర్ మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కవిత పర్యటన

ఘనపూర్ మండలంలో వరద  ప్రభావిత ప్రాంతాల్లో కవిత పర్యటన

మెదక్, వెలుగు: జాగృతి జనం బాటలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం హవేలీ ఘనపూర్​ మండలంలో పర్యటించారు, ఉదయం కూచన్​పల్లి లో పాడి రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

సాయంత్రం వాడి, రాజ్​పేట, దూప్​ సింగ్​ తండాలో పర్యటించారు. కొన్నాళ్ల కింద భారీ వరదల కారణంగా దెబ్బతిన్న పంటలు,  దెబ్బతిన్న బ్రిడ్జిలు, రోడ్లను పరిశీలించారు. జల దిగ్భందంలో  చిక్కుకున్న దూప్​సింగ్ తండాను సందర్శించి గిరిజనులతో మాట్లాడారు. 

వరదల కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. తండా నీట మునగడంతో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను గిరిజనులు ఎకరువు పెట్టారు. కలెక్టర్​తో మాట్లాడి రోడ్లు, బ్రిడ్జి పనులు త్వరగా పూర్తి చేయాలని, గిరిజనులకు సౌకర్యాలు మెరుగుపరచేలా చర్యలు తీసుకోవాలని కోరతామని  కవిత చెప్పారు.