
- కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, వెలుగు : విద్యారంగంలో కామారెడ్డి జిల్లాను ఉన్నత స్థాయిలో నిలపాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ స్కూల్లో ఎఫ్ఎల్ఎన్ మేళాను ప్రారంభించి మాట్లాడారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థుల్లో ప్రమాణాలు పెంచాలన్నారు. ప్రాథమిక స్థాయిలో పునాది బలంగా ఉంటే ఉన్నత విద్యలో రాణిస్తారని, తరగతుల్లో అభ్యసన సామగ్రి వినియోగంతో పిల్లల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుందన్నారు. ఎస్సెస్పీ ఫలితాల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో విద్యా శాఖ అధికారులు, కో ఆర్డినేటర్లు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.
ఇసుక, ఖనిజాలపై రిపోర్టు సిద్ధం చేయాలి
జిల్లాలో లభ్యమయ్యే ఇసుక, ఖనిజాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే చేపట్టి రిపోర్టు తయారు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వడానికి జిల్లా సర్వే రిపోర్టు తప్పనిసరి అవుతుందన్నారు. గనుల కార్యకలాపాలు, లీజులు, రాయల్టీ ఆదాయం, ఇసుక ఉత్పత్తి, వర్షపాతం, నదులు, -వాగులను రిపోర్టులో పొందుపరచాలని సూచించారు.
మూడు రోజుల్లో సర్వే పూర్తి చేసి సెప్టెంబర్ చివరికి ముసాయిదా సిద్ధం చేయాలన్నారు. అక్టోబర్ మొదటి వారంలో ప్రజాభిప్రాయం కోసం జిల్లా వెబ్సైట్లో ఉంచాలని, తుది రిపోర్టును నవంబర్లో టీజీఎండీసీకి పంపాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, మైనింగ్ ఏఈ నగేశ్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
శానిటేషన్పై కలెక్టర్ ఆగ్రహం
జిల్లా కేంద్రంలోని శానిటేషన్ పనులు సక్రమంగా జరగకపోవటంపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం 15వ వార్డు వినాయక్నగర్లో ఇటీవల వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల పనులను ఆకస్మికంగా పరిశీలించిన ఆయన, శానిటేషన్లో నిర్లక్ష్యం కారణంగా మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డిని ప్రశ్నించారు. శానిటరీ ఇన్స్పెక్టర్, ఏరియా శానిటరీ జవాన్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాలతో దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ అత్యవసర పనుల కోసం కేటాయించిన నిధులను వినియోగించి పనులు పూర్తి చేయాలని సూచించారు.