శాంతిభద్రతలు సజావుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం

శాంతిభద్రతలు సజావుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యం

కామారెడ్డి  వెలుగు: సమాజంలో శాంతి భద్రతలు కాపాడడంతో పోలీసుల పాత్ర విలువైందని కామరెడ్డి కలెక్టర్​ జితేశ్​ వి పాటిల్​ అన్నారు. శుక్రవారం పోలీసు అమరుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్​ మాట్లాడుతూ.. అమరుల త్యాగం మరువలేనిదన్నారు. వారి కుటుంబాలకు ప్రభుత్వం, అధికారులు ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ శ్రీనివాస్​రెడ్డి, అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్​దొత్రే, అడిషనల్​ ఎస్పీ అన్యోన్య పాల్గొన్నారు. 

నిజామాబాద్ క్రైమ్, వెలుగు: శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసులకు అందరం రుణపడి ఉండాలని అని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్  చీఫ్​ గెస్ట్​గా  పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ నాగరాజు తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శాంతిభద్రతలు సజావుగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు.  దానికోసం పోలీసుల సేవలు, వారి త్యాగాలు మరువలేనివని కొనియాడారు. కమిషనర్ కేఆర్. నాగరాజు మాట్లాడుతూ.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 264 మంది పోలీసులు అమరులయ్యారని అన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో 1986 నుండి ఇప్పటివరకు 18 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఆర్డీఓ రవి, డీసీపీలు అరవింద్ బాబు, గిరిరాజ్, ఏసీపీలు వెంకటేశ్వర్లు, వి.శ్రీనివాస్, సీఐ లు, ఎస్.ఐలు, పోలీసు సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.