కామారెడ్డిటౌన్, వెలుగు : ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి ఆశ్వినీ వైష్ణవ్ను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం కలిశారు. కామారెడ్డిలో నిర్మాణం చేపట్టాల్సిన ఆర్వోబీలు, పుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కోసం కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించారు. జిల్లా కేంద్రంలో 3 ఆర్వోబీలు ( రోడ్ ఓవర్ బ్రిడ్జి), ఒక పుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు.
స్నేహపూరి కాలనీ నుంచి కలెక్టర్ ఆఫీసు రోడ్డు, వికాస్ నగర్ నుంచి ఇస్లాంపురా కాలనీ, పాత రాజంపేట రైల్వే గేట్ వద్ద ఆర్వోబీలు, ప్రియా టాకీసు రోడ్డు నుంచి ఇందిరా చౌక్ వరకు రైల్వే స్టేషన్ మీదుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలన్నారు. జిల్లా కేంద్రంలో పెరిగిన ట్రాఫిక్కు అనుగుణంగా ఈ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని కేంద్ర మంత్రికి విన్నవించారు. మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలో రైల్వే అధికారులు స్థల పరిశీలన చేయాలని మంత్రి ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు.

