ఓవర్ లోడ్కు చెక్ .. కామారెడ్డిలో ఇండోర్ కరెంట్ సబ్ స్టేషన్

ఓవర్ లోడ్కు చెక్ .. కామారెడ్డిలో ఇండోర్ కరెంట్ సబ్ స్టేషన్
  • 33/11 కేవీ సబ్ స్టేషన్ ఏర్పాటుకు స్థల సేకరణ
  • ఈ నెలాఖరులోగా పూర్తి కానున్న టెండర్ల ప్రక్రియ
  • సుమారు రూ. 3.50 కోట్లతో సబ్​స్టేషన్ నిర్మాణం
  • ఇప్పటికే పట్టణంలో అదనపు ట్రాన్స్ ఫార్మర్లు
  • మెరుగైన విద్యుత్తు సరఫరాకు జిల్లా యంత్రాంగం చర్యలు

కామారెడ్డి​, వెలుగు : విద్యుత్తు ఓవర్​ లోడ్ సమస్యకు చెక్ పెట్టేందుకు జిల్లాయంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు అవుట్ డోర్ సబ్ స్టేషన్లు ఉండగా, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటు కానున్నది. ఇప్పటికే స్థలాన్ని కేటాయించగా, ఈ నెలాఖరులోగా మంజూరై టెండర్ల పక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలతోపాటు, టౌన్ కలిపి  33/11 కేవీ సబ్​స్టేషన్లు 5 ఉన్నాయి.  టెకిర్యాల్ సమీపంలో, సిరిసిల్లా రోడ్డు, హౌజింగ్,  కలెక్టరేట్ సమీపంలో, కాకతీయ నగర్ కాలనీలో సబ్ స్టేషన్లు ఉన్నాయి. ఎండాకాలంలో కరెంట్ సప్లయ్​లో అంతరాయం ఏర్పడుతోంది. లోడ్​ తట్టుకునేందుకు అదనపు ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేశారు.  ఒక సబ్​స్టేషన్​ పరిధిలో సమస్య ఏర్పడితే మరో సబ్ స్టేషన్​ నుంచి లోడ్ తీసుకొని పవర్ సప్లయ్ చేస్తున్నారు.   

ఇండోర్ సబ్ స్టేషన్ ఏర్పాటుతో.. 

జిల్లా కేంద్రం బిజినెస్ ఏరియా కావడంతో విద్యుత్​వినియోగం అధికంగా ఉంటుంది.  లోడ్​ అధికమైనప్పుడు ట్రిప్పై సమస్య ఏర్పడుతుండడంతో మరో 33/11 కేవీ ఇండోర్​సబ్​స్టేషన్​కు అధికారులు ప్రపోజల్ పెట్టారు. సబ్​స్టేషన్​ నిర్మాణానికి పట్టణం మధ్యలో ఎకరం స్థలం దొరకటం కష్టంగా మారింది. పాత తహసీల్దార్ ఆఫీసు వద్ద 4  గుంటల భూమిని ఎన్​పీడీసీఎల్ అధికారులు కేటాయించగా, ఉన్నతాధికారులు పరిశీలించారు.  పక్రియ అంతా పూర్తి కాగా, ఈ నెలాఖరుగా మంజూరు కావడంతో పాటు టెండర్ల పక్రియ కంప్లీట్​ కానున్నది. 

సబ్​స్టేషన్​నిర్మాణానికి సుమారు రూ. 3 కోట్ల నుంచి రూ. 3.50 కోట్ల వరకు ఖర్చు కానుంది. నార్మల్​ సబ్​ స్టేషన్​ కంటే రూ.కోటి వరకు అదనంగా ఖర్చవుతోంది. ఇండోర్​ సబ్​ స్టేషన్​ను తక్కువ విస్తీర్ణంలో  నిర్మిస్తారు.  పవర్​ ట్రాన్స్​ఫార్మర్లు మాత్రం బయట ఉంటాయి. మిగతా ఎక్విప్ మెంట్స్ ఇండోర్​లో ఉంటాయి. టౌన్​ మధ్యలో నుంచి ఏ సబ్​ స్టేషన్ పరిధిలో ప్రాబ్లమ్ వచ్చినా ఇక్కడి నుంచి సప్లయ్​ చేయవచ్చు. ప్రత్యేకంగా లైన్లు వేయాల్సిన అవసరం ఉండదు.    

తీరనున్న విద్యుత్తు లోడ్​ సమస్య..

ఇండోర్​ సబ్​స్టేషన్ నిర్మాణంతో జిల్లా కేంద్రంలో విద్యుత్తు ఓవర్​లోడ్ సమస్య తీరనున్నది. సబ్​స్టేషన్​ నిర్మాణానికి స్థల పరిశీలనతో పాటు, ఇతర పక్రియలు పూర్తి అయ్యాయి. జిల్లా కేంద్రం మధ్యలో ఏర్పాటు కానుండడంతో నాణ్యమైన కరెంట్​ సరఫరా కానుంది.  

శ్రావణ్​కుమార్​, ఎస్ఈ, ఎన్​పీడీసీఎల్ కామారెడ్డి