కోవిడ్(కరోనా వైరస్ డిసీజ్)తో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా చైనాలో ఎక్కువ మంది చనిపోతుండగా, ఇప్పుడు వేరే దేశాల్లోనూ మరణాలు నమోదవుతున్నాయి. మన దేశంలోనూ తొలి కొవిడ్ మరణం నమోదైనట్టు తెలుస్తోంది. కేరళకు చెందిన 36 ఏళ్ల వ్యక్తి ఆ మహమ్మారికి బలైపోయాడని సమాచారం. పయన్నూర్కు చెందిన అతడు కొవిడ్ లక్షణాలతో శుక్రవారం రాత్రి ఎర్నాకులంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చేరాడని అధికారులు చెబుతున్నారు. ఆ రోజు రాత్రే అతడి బ్లడ్ శాంపిళ్లను అలప్పుజలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో టెస్ట్ చేయగా నెగెటివ్ వచ్చిందని అంటున్నారు. అయితే, టెస్టులు చేసిన కొద్ది సేపటికే శుక్రవారం అర్ధరాత్రి (12.30 గంటలకు– శనివారం) చనిపోయాడని తెలుస్తోంది. అతడు చనిపోయింది కొవిడ్తోనేనా కాదా అని నిర్ధారించుకునేందుకు మరోసారి అతడి శాంపిళ్లను టెస్టుకు పంపుతున్నట్టు అధికారులు చెప్పారు. పుణేలోని ఎన్ఐవీకి ఆ శాంపిళ్లను పంపామని, రిపోర్టులొచ్చాక కొవిడో కాదో తేలుస్తామని తెలిపారు.
రెండున్నరేళ్లుగా మలేసియాలో
చనిపోయిన వ్యక్తి రెండున్నరేళ్లుగా మలేసియాలోని సూపర్మార్కెట్లో పనిచేస్తున్నాడని అధికారులు చెప్పారు. గురువారం రాత్రి కొచ్చికి వచ్చాడని, దగ్గు, జ్వరం వంటి లక్షణాలుండడంతో అర్ధరాత్రి దాటాక (శుక్రవారం) ఒంటి గంట టైంలో ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో పెట్టామన్నారు. వెంటిలేషన్తో ట్రీట్మెంట్ చేశామన్నారు. అంతేగాకుండా టెస్టుల్లో అతడికి ఇంతకుముందు న్యుమోనియా ఉండేదని తేలింది. దాంతో పాటు షుగర్తోనూ బాధపడుతున్నట్టు డాక్టర్లు నిర్ధారించారు. అతడి మరణానికి కారణం న్యుమోనియా, శ్వాసకోశ వ్యవస్థ ఫెయిలవడమేనని డాక్టర్లు నిర్ధారించారు. పుణే ఎన్ఐవీ నుంచి టెస్ట్ రిపోర్టులు వస్తే గానీ అతడి మరణానికి అసలు కారణమేంటన్నది తెలుస్తుందని చెబుతున్నారు.
అమెరికాలోనూ ఫస్ట్ డెత్
అమెరికాలోనూ తొలి కొవిడ్ మరణం నమోదైంది. ఇంతకుముందే ఓ అమెరికన్ చనిపోయినా, అతడు చనిపోయింది వుహాన్లో. తాజాగా అమెరికా గడ్డపైనే తొలి మరణం నమోదైంది. వాషింగ్టన్ స్టేట్లోని కింగ్ కౌంటీకి చెందిన ఓ మహిళ దానికి బలైందని అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇంటర్నేషనల్ ట్రావెల్పై ఆంక్షలు విధించారు. చైనా, ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ నుంచి వచ్చే వాళ్లపై నిషేధం విధించారు. ‘‘దురదృష్టవశాత్తూ 50 ఏళ్ల ఓ మహిళ చనిపోయింది. దేశంలో మరిన్ని కొవిడ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, ఆరోగ్యవంతులు ఆ వైరస్ నుంచి త్వరగా కోలుకుంటారు. ప్రస్తుతం ఈ ఒక్క మరణంతో కంగారు పడాల్సిన పనిలేదు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’ అని వైట్హౌస్లో ట్రంప్ ప్రకటించారు. ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ వంటి దేశాలకు వెళ్లొద్దని అమెరికన్లకు సూచించారు. కొవిడ్ను అడ్డుకునే పనిలో భాగంగా పాకిస్తాన్ సోమవారం నుంచి వారం రోజుల పాటు ఆఫ్గనిస్థాన్తో సరిహద్దులను మూసేయనుంది. ఈ మేరకు ఆ దేశ ఇంటీరియర్ మినిస్ట్రీ ప్రకటించింది.
చికెన్ వంటలు 30 రూపాయలే
కొవిడ్ భయాల నేపథ్యంలో కోళ్లు, గుడ్లకూ ఆ వైరస్ సోకుతోందని, దాన్ని తింటే ప్రమాదమని పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పూర్లో చికెన్ మేళాను ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ ఫాం అసోసియేషన్ ఆధ్వర్యంలో చికెన్తో రకరకాల వంటకాలను తయారు చేసి జనానికి అందిస్తున్నారు. ఏ వంటకమైనా రూ.30కే ఇస్తున్నారు. చికెన్, మటన్, చేపలు తిన్నంత మాత్రాన కొవిడ్ రాదని చెప్పేందుకే ఈ ప్రయత్నమని అసోసియేషన్ ప్రెసిడెంట్ వినీత్ సింగ్ తెలిపారు. మేళాలో భాగంగా వెయ్యి కిలోల చికెన్తో వంటలు తయారు చేశామని, అవన్నీ ఖాళీ అయ్యాయని చెప్పారు.
ఇరాన్లో పెరుగుతున్న మరణాలు
ఇరాన్లో కొవిడ్ మరణాలు పెరుగుతున్నాయి. ఆదివారం నాటికి కొవిడ్తో చనిపోయిన వారి సంఖ్య 54కు పెరిగింది. 987 మంది వైరస్ బారిన పడ్డారు. వైరస్కు కేంద్ర బిందువైన చైనాలో మరణాలు తగ్గుముఖం పడుతున్నా, వేరే దేశాల్లో మరణాలు నమోదవుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చైనాలో శనివారం 35 మంది చనిపోగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,870కి పెరిగింది. కేసులు 79,824కు చేరాయి. ప్రపంచవ్యాప్తంగా 61 దేశాలకు వైరస్ వ్యాపించగా, 86 వేల మందికి సోకింది. ఖతార్, ఈక్వెడార్, ఐర్లాండ్లలో ఫస్ట్ కేసులు నమోదయ్యాయి.
కొరియాలో కాల్చేశారు
కొవిడ్తో బాధపడుతున్న వారిని రక్షించుకునేందుకు వివిధ దేశాలు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ, కర్కశత్వానికి మారుపేరుగా పిలుచుకునే ఉత్తర కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్, కొవిడ్ పేషెంట్ను జాలి, దయ లేకుండా కాల్చి చంపించినట్టు తెలుస్తోంది. చైనా అఫైర్స్ అనలిస్టుగా చెబుతున్న ఓ వ్యక్తి ‘సీక్రెట్ బీజింగ్’ అనే ట్విట్టర్ అకౌంట్లో ఆ విషయాన్ని వెల్లడించారు. ‘‘కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునే పనిలో భాగంగా కొరియాలో తొలి కొవిడ్ పేషెంట్ను కాల్చి చంపేసేందుకు కిమ్ జోంగ్ఉన్ ఆర్డర్ వేశారు’’ అంటూ అందులో పేర్కొన్నాడు. అయితే, ఆ పేషెంట్ వివరాలను మాత్రం వెల్లడించలేదు. కాగా, అంతకుముందు ఫిబ్రవరి 13న ఓ ట్రేడ్ అఫీషియల్నూ కాల్చి చంపించినట్టు చెబుతున్నారు. మెట్రోయూకే కథనం ప్రకారం, 14 రోజుల పాటు క్వారెంటైన్లో ఉండాల్సిన ఓ ట్రేడ్ అఫీషియల్ పబ్లిక్లోకి వెళ్లడంతో కిమ్కు కోపమొచ్చిందట. దీంతో వెంటనే కాల్చి చంపేయండంటూ ఆర్డర్స్ పాస్ చేశారట. అంతేగాకుండా, క్వారెంటైన్ నుంచి బయటకు వచ్చే ఎవరికైనా ఇదే గతి పడుతుందంటూ హెచ్చరించారట. కొద్ది రోజుల క్రితం చైనా నుంచి వచ్చిన ఆ అధికారిని క్వారెంటైన్లో పెట్టారట. కానీ, అతడు అవేవీ లెక్క చేయకుండా జనాల్లోకి వెళ్లిపోయాడట. మరోవైపు తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని డబ్ల్యూహెచ్వోకు కొరియా చెప్పింది.