
గంగాధర, వెలుగు: కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశాల మేరకు ఆర్డీవో మహేశ్వర్, జిల్లా రిజిస్ట్రార్ప్రవీణ్కుమార్ కొత్తపల్లి పట్టణం 175, 197, 198 సర్వే నంబర్లలోని సుమారు 20 ఎకరాల భూమికి జరిగిన 476 రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. 30 ఏళ్లుగా సీలింగ్ యాక్ట్ అమలులో ఉన్న ఆ భూములను రిజిస్ట్రేషన్ చేయొద్దని హైకోర్టు కరీంనగర్రూరల్, గంగాధర సబ్ రిజిస్ట్రార్ఆఫీసులకు ఐదుసార్లు నోటీసులు ఇచ్చింది. అయినా పట్టించుకోకుండా 476 రిజిస్ట్రేషన్లు చేశారు. వీటికి సంబంధించి లోక్సత్తా నాయకుల ఫిర్యాదుతో లోకాయుక్త చర్యలకు ఆదేశించింది. 10 రోజుల కింద ఈ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం అర్ధరాత్రి వరకు 50 రిజిస్ట్రేషన్లను రద్దు చేయగా, గురువారం వరకు 150 నుంచి 200 రిజిస్ట్రేషన్లు రద్దవుతాయని సబ్రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు తెలిపారు.
కాగా కొత్తపల్లి మండలం 2018 వరకు కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఉండగా ఆ తర్వాత గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోకి మారింది. అంతకుముందే కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 424 రిజిస్ట్రేషన్లు కాగా, గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో 52 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. 175, 197, 198 సర్వే నంబర్లలో అక్రమంగా జరిగిన 476 రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు గంగాధర సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ల రద్దు ప్రక్రియను ప్రారంభించామని ఆర్డీవో మహేశ్వర్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ రద్దు ప్రక్రియ పూర్తైన తర్వాత నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామన్నారు.