కరీంనగర్ టౌన్, వెలుగు: ఎన్నికల నిర్వహణలో బెస్ట్ పర్ఫాఫెన్స్ కనబరిచిన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతికి విశిష్ఠ గౌరవం దక్కింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కలెక్టర్కు అవార్డును అందజేశారు.
ఎన్నికల ప్రక్రియలో కీలక పాత్ర వహించే ఎన్నికల అధికారులు, సహాయక అధికారులు, పోలింగ్ సిబ్బంది, పరిశీలకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు, ఎన్నికల రూల్స్, విధివిధానాలపై స్పష్టమైన అవగాహన కల్పించడం, సిబ్బంది నైపుణ్యాలను మెరుగుపరచడం.. వంటి అంశాల్లో కలెక్టర్ చొరవ చూపారు.
దీంతోపాటు వినూత్నంగా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను అమలుచేయడంపై ఈ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, ఎన్నికల అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వల్లే ఈ అవార్డు సాధ్యమైందన్నారు.
