కరీంనగర్, వెలుగు: ఐటీ రంగానికి మారు పేరు హైదరాబాద్. ఈ విషయంలో రాష్ట్రంలోని ఏ సిటీ కూడా దాని దరిదాపుల్లో లేదు. వరంగల్, నిజమాబాద్ లాంటి నగరాల్లో ప్రయోగాత్మకంగా పలు ఐటీ పరిశ్రమలు నెలకొల్పినా అంతగా క్లిక్ కాలేదు. హైదరాబాద్ తర్వాత మొదటిసారి కరీంనగర్లో నిర్మిస్తున్న ఐటీ టవర్నిర్మాణం దాదాపు పూర్తికావచ్చింది. సుమారు రూ.35 కోట్లతో చేపట్టిన పనులు నెలరోజుల్లో పూర్తికానున్నాయి. 11 కంపెనీలతో ప్రభుత్వం ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో మూడువేల మందికి జాబ్స్ దొరికే అవకాశం ఉంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఐటీ సెంటర్ను జనవరిలో ప్రారంభించేందుకు ఆఫీసర్లు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
జీ ప్లస్ 5 మోడల్లో..
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేరు డ్యామ్ సమీపంలో చేపట్టిన ఐటీ హబ్ నిర్మాణం పూర్తికావచ్చింది. రూ.35 కోట్ల నిధులతో 6200 స్క్వేర్ఫీట్స్ వైశాల్యంతో, జీప్లస్ 5 మోడల్లో దీన్ని కడుతున్నరు.కరీంనగర్లో ఐటీ టవర్కు 2018 జనవరి 8న శంకుస్థాపన చేశారు. అదే రోజు 11 కంపెనీలు ఎంవోయూ కుదుర్చుకున్నాయి. దీంతో మూడు వేల నుంచి 3600 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని భావిస్తున్నారు. పాత కరీంనగర్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ఏటా వేలాది మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో హైదరాబాద్, బెంగళూర్ తదితర సిటీలకు, ఆస్ట్రేలియా, అమెరికా తదితర దేశాలకు వెళ్తున్నారు. ఇక్కడ ఐటీ టవర్ ప్రారంభమైతే లోకల్ ఇంజినీరింగ్గ్రాడ్యుయేట్స్కు ఇక్కడే ఉద్యోగాలు దొరికే చాన్స్ ఉంది. అంతేకాకుండా ఇక్కడ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే ఔత్సాహికులకు పవర్ టారిఫ్, బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్లో సబ్సిడీ తదితర ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఈక్రమంలో
చాలా మంది ఇక్కడ కంపెనీల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు.
స్కిల్ సెంటర్గానూ..
ఈ ఐటీ సెంటర్కేవలం ఉద్యోగాల కల్పనకే కాకుండా నైపుణ్య కేంద్రంగానూ ఉండబోతోంది. ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుకునే ఫైనలియర్ విద్యార్థుల కోసం, కొత్తగా వచ్చే ఉద్యోగార్థుల కోసం నైపుణ్య శిక్షణ ఇస్తారు. ఇందుకోసం ప్రత్యేకంగా ట్రైనింగ్సెంటర్ ఏర్పాటుచేస్తున్నారు. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్(టాస్క్) ద్వారా ప్రపంచస్థాయి శిక్షణ, నైపుణ్యం అందజేస్తారు. భవిష్యత్లో స్టార్టప్ కేంద్రంగానూ రూపుదిద్దుకుంటుందని ఆఫీసర్లు చెబుతున్నారు.
ఎన్నో ప్రత్యేకతలు..
సుమారు రూ.35 కోట్ల తో నిర్మిస్తున్న ఈ టవర్ 6200 చదరపు ఫీట్ల వైశాల్యం. జీప్లస్ 5 మోడల్లో లోయర్ మానేరు డ్యామ్ పక్కన పూర్తి ఆహ్లాదకర వాతావరణంలో నిర్మిస్తున్నారు. ఒకే సారి 60 కార్లు పార్క్ చేసేలా సెల్లార్ ఏర్పాటు చేశారు. టవర్ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఎలివేషన్ పనులు చివరి దశలో ఉన్నాయి. ఇంటిరీయర్ పనులు నాలుగైదు రోజుల్లో పూర్తి కానున్నారు. ఇంటర్నెట్ సౌకర్యం మెరుగ్గా ఉండాలనే లక్ష్యంతో నాణ్యమైన, వేగవంతమైన ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ వాడుతున్నారు. టవర్ మొత్తం వైఫై సౌకర్యం కల్పించనున్నారు.