పీవీ సంస్కరణల వల్లే దేశం ముందుకు..నాయకులకు ఆయన స్ఫూర్తి: డిప్యూటీ సీఎం భట్టి

పీవీ సంస్కరణల వల్లే దేశం ముందుకు..నాయకులకు ఆయన స్ఫూర్తి: డిప్యూటీ సీఎం భట్టి
  • వంగరలో పీవీ స్మృతివనం పూర్తి చేస్తం: మంత్రి పొన్నం

హైదరాబాద్​సిటీ, వెలుగు: మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు చేసిన సంస్కరణల వల్లే దేశం నేడు ప్రగతి పథంలో నడుస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. పీవీ104 వ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్  నెక్లెస్​రోడ్​లోని పీవీ జ్ఞానభూమిలో భట్టితో పాటు రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్  నివాళులర్పించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బహుభాషా పండితుడిగా పీవీ ఎన్నో సంస్కరణలను తెచ్చారని అన్నారు.

ఆయన తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయన్నారు. అనేక పథకాలు ప్రవేశపెట్టి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పీవీ పాటుపడ్డారని కొనియాడారు. దేశనాయకులకు పీవీ స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్​ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలోనూ పీవీ అనేక సంస్కరణలు తెచ్చారని అన్నారు.

నవోదయాలు, గురుకులాలు పీవీ చలవే అని పేర్కొన్నారు. వంగరలో పీవీ స్మృతివనం పూర్తి చేసే కార్యాచరణ తీసుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పీవీ కుటుంబ సభ్యులు ఆరోగ్యశిబిరం నిర్వహించారు. వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు కూడా పీవీకి ఘనంగా నివాళులర్పించారు. 

పేదల జీవితాల్లో వెలుగులు నింపారు: సీతక్క 

మాజీ ప్రధాని పీవీ నరసింహరావు ఎన్నో సంస్కరణలు తెచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపారని మంత్రి సీతక్క పేర్కొన్నారు. శనివారం పీవీ జయంతి సందర్భంగా హైదరాబాద్​ ప్రజాభవన్​లో ఆయన చిత్రపటానికి సీతక్క నివాళులర్పించి మాట్లాడారు. ఆయన బహుభాషాకోవిదుడని కొనియాడారు. భాషలే కాదు ప్రజల బాధలు కూడా ఆయనకు తెలుసన్నారు. భూ సంస్కరణలు అమలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లక్షలాది ఎకరాల భూములు పంచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్  మేయర్  గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.

నిరాడంబర జీవితానికి నిదర్శనం పీవీ: సంజయ్

నిరాడంబర జీవితానికి, అపారమైన రాజనీతిజ్ఞతకు మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు నిలువెత్తు నిదర్శనమని కేంద్రమంత్రి బండి సంజయ్  అన్నారు. ఆయన సేవలను దేశం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శనివారం పీవీ జయంతి సందర్భంగా ఈ మేరకు సంజయ్  ఒక ప్రకటన విడుదల చేశారు. భారతరత్న అవార్డును అందుకోవడంతో పాటు ప్రధాని పదవిని అధిరోహించిన ఏకైక తెలుగు వ్యక్తి, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ అని కొనియాడారు.