
కొంతమంది పిల్లలకు చాలా తెలివితేటలు ఉన్నా.. క్లాస్ లో ఫస్ట్ వచ్చే లక్షణాలున్నా రాణించలేరు. ఎందుకంటే స్కూల్లో ఉండే వాతావరణం అలవాటుకాకపోవడం.. ఇంట్లో పేరంట్స్ ప్రోత్సాహం లేకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి వారిని గుర్తించి కొద్దిగా కేర్ తీసుకుంటే టాపర్ గా ఉంటారు.. అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం. .
సుజిత్ ఏబీసీడీలు చెప్పు..అడిగింది టీచర్. ..అసలే సుజిత్ బెరుకు, మెతక పిలగాడు. అంతకాలం ఇంట్లో అమ్మ వడిలో ఆడుకుంటూ పెరిగి, హఠాత్తుగా ఏదో దీవిలోకొచ్చి పడ్డట్టు ఇంకా తోటి పిల్లలతోనే అలవాటు పడలేదు. ఇక పాఠాలేం అప్పజెబుతాడు?"నిన్నే. నోరు విప్పుతావా లేదా?" కోపంతో టీచర్ రెట్టించే కొద్దీ మరింత బిగుసుకుపోయాడు గానీ నోరు విప్పలేదు.ఆ భయం అలాగే కొనసాగి చదువులో వెనుకబడటం, దానికితోడు 'సువ్వెందుకూ పనికిరావు' అని ఇంట్లోవాళ్లు, 'వాడితో చేరితే మీరూ దద్దమ్మలవుతారు' అని మిగిలిన పిల్లలతో టీచర్లు అనటం విని మరింత కుంచించుకుపోసాగాడు.
సుజిత్ ఎనిమిదో తరగతికి వచ్చాడు. ఇప్పుడు అతని క్లాస్ టీచర్ సుగుణ. ఆమెకు ఆ స్కూల్లోనే బెస్ట్ టీచరన్న పేరుంది. సుజిత్ సంగతి తొందరగానే పసిగట్టిందామె.జూన్ నెలలో క్లాసులు ప్రారంభమై అందరూ స్కూల్ కి రావడంతోనే, బాగా చదివే పిల్లల్ని వెనుక బెంచీల్లోకి, సుమారుగా చదివే పిల్లల్ని మధ్య బెంచీలకు, తక్కువ మార్కులొచ్చే వారిని ముందు కూర్చోబెట్టింది.
పాఠంతో పాటు పిట్టకథలు, బండగుర్తులు చెప్పేది. నవ్విస్తూ జోక్స్ చెబుతున్నట్టే ప్రశ్నలు వేసేది. దాంతో సుజిత్ సహా పిల్లలందరికీ ఒకటి రెండు మార్కుల తేడా తప్ప ఫెయిలయ్యేంత తేడాతో మార్కులు రాలేదు.
సుజితికి తనమీద తనకే నమ్మకం లేనట్టు అనిపించింది. మొదటిసారి చాలా ఆశ్చర్యం వేసింది అతని తల్లిదండ్రులకు కూడా. పదవతరగతిలో అయితే ఏకంగా స్కూల్ ఫస్ట్ వచ్చేశాడు.
తనకు థ్యాంక్స్ చెప్పడానికొచ్చిన అతని పేరెంట్స్ తో మీరనుకుంటున్నంత గొప్ప పనేమీ నేను చేయలేదండి. పిల్లల బెరుకును మరింత పెంచేలా ఈసడించుకుని, నిరాశపరిస్తే ఎప్పటికీ వారి మెదడు ప్యూపా దశలోనే నిద్రావస్తతో మొద్దుబారి 'నేనింతే. మొద్దుని. ర్యాంకులంటే మరెవరికో వస్తాయి' అన్న అభిప్రాయం నాటుకుపోతుంది. ఉత్సాహమైన మాటలవల్ల అదే పిల్లవాడు మారి, విలువైన ఫలితాన్ని సాధిస్తాడు” అని చెప్పింది. అది విన్న మిగతా తల్లిదండ్రులు, తోటి టీచర్లు కూడా ఆమె ఓపికను, పిల్లల పట్టుదలను అభినందించారు. తాము కూడా ఎవరినీ ఎద్దేవా చేయకుండా వీలైతే ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు..