
హైదరాబాద్: ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తమ కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ అనే వ్యక్తే కారణమని స్వేచ్ఛ తండ్రి శంకర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ పూర్ణ చందర్ నాయక్ రాత్రి 11 గంటలకు అడ్వకేట్ సమక్షంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్లడం గమనార్హం. అంతేకాదు.. తాను నిర్దోషిని అని, కోర్టులలో చెప్పే నిజాలు ప్రజలకు తెలియవని.. అందుకే మీడియాను ఆశ్రయించానని పూర్ణ చందర్ నాయక్ ఒక సంచలన లేఖ రాశాడు.
ఈ లేఖలో తనకు, స్వేచ్ఛకు మధ్య సన్నిహిత సంబంధం ఉందని పూర్ణచందర్ అంగీకరించాడు. అయితే.. ఆమెను ఆవహించిన ఒంటరితనానికి, ఆమె మానసిక స్థితికి తాను కారణం కాదని చెప్పాడు. తన కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు పిలిపించి.. బెదిరించి.. పూర్ణచందర్ వచ్చే వరకూ మీరు పోలీస్ స్టేషన్లోనే ఉండాలని చెప్పిన విధానం తనను బాధించిందని పూర్ణ చందర్ ఆవేదన వ్యక్తం చేశాడు.
స్వేచ్ఛ అంత్యక్రియలు అశ్రు నయనాల మధ్య జరిగాయి. జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆమెకు తుది వీడ్కోలు పలికారు. హైదరాబాద్ చిక్కడపల్లి జవహర్నగర్లోని శీలమ్స్ రెసిడెన్సిలోని నివాసంలో శుక్రవారం స్వేచ్ఛ బలన్మరణానికి పాల్పడ్డారు. శుక్రవారం రాత్రి సుమారు 11.30 గంటలకు ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.
చిక్కడపల్లి పోలీసుల నుంచి పంచనామా పత్రాలు అందిన తర్వాత శనివారం మధ్యాహ్నం పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి, డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అందజేశారు. ముషీరాబాద్లోని వైఎస్సార్పార్క్ సమీపంలో తల్లిదండ్రుల ఇంటి వద్దకు భౌతిక కాయాన్ని తీసుకెళ్లారు. అక్కడ పలువురు నివాళులర్పించిన తర్వాత అంతిమయాత్ర చేపట్టారు. దారిపొడవునా ప్రజాసంఘాల నేతలు స్వేచ్ఛను తలుచుకుంటూ విప్లవ గేయాలు పాడారు. అంబర్ నగర్ స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు.
స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తండ్రి శంకర్ ఏం చెప్పారంటే..
తమ కూతురు స్వేచ్ఛ ఆత్మహత్యకు పూర్ణచందర్ అనే వ్యక్తే కారణమని మృతురాలి తండ్రి శంకర్ ఆరోపించారు. గాంధీ మార్చురీ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్ణచందర్ మూడేండ్ల నుంచి తన కూతురు వెంట పడ్డాడని, అతడి వేధింపుల వల్లే స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని చెప్పారు. ‘‘నా కూతురు పెండ్లికి అంగీకరించినా కూడా ఇద్దరి మధ్య చాలా సార్లు గొడవ జరిగింది.
ఇటీవల గొడవలు తీవ్రంకాగా పూర్ణచందర్తో కలిసి ఉండను అని స్వేచ్ఛ తేల్చి చెప్పింది. ఈ నెల 26న ఇద్దరికీ గొడవ జరిగితే నన్ను ఇంటికి రమ్మని పిలిచింది. అప్పుడు నేను వెళ్లి మాట్లాడిన. పూర్ణచందర్తో నేను రిలేషన్ లో ఉండలేను అని చెప్పింది. పూర్ణచందర్ వేధింపుల వల్ల నా కూతురు తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నది” అని తండ్రి శంకర్ తీవ్ర ఆవేదన చెందారు.