
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో రైల్వే ట్రాక్పై కారుతో హల్చల్ చేసిన యువతిని రైల్వే పోలీసులు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. యువతి మానసిక స్థితిపై రిపోర్ట్ తీసుకోనున్నారు. 2025, జూన్ 26న నాగులపల్లి నుంచి శంకర్ పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్ చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు యువతిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఉస్మానియా హాస్పిటల్లో వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపర్చారు. ఆ తర్వాత కోర్టు అనుమతితో యువతి మానసిక స్థితిపై రిపోర్ట్ కోసం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కు తరలించారు. యువతి మెంటల్ స్టేటస్పై క్లారిటీ వచ్చాక తిరిగి రైల్వే కోర్ట్లో పోలీసులు ప్రవేశపెట్టనున్నారు.
అసలేం జరిగిందంటే..?
గురువారం (జూన్ 26) నాగులపల్లి నుంచి శంకర్ పల్లి వెళ్లే మార్గంలో రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి హల్చల్ చేసింది. గమనించిన స్థానికులు నాగులపల్లిలో కారును అడ్డుకున్నప్పటికీ పట్టాలపై వేగంగా కారు నడుపుతూ ఆ యువతి ఎవరి మాట వినకుండా మొండికేసింది. అదే సమయంలో ఎదురుగా రైలొచ్చింది. ట్రైన్ లోకో పైలెట్ పట్టాలపై కారు వస్తుండటాన్ని గమనించి అలర్ట్ అయి ట్రైన్ను నిలిపివేశాడు. దీంతో.. పెద్ద ప్రమాదమే తప్పింది.
Also Read : ఒడిశా నుంచి ఓల్డ్ సిటీకి గంజాయి
ఈ యువతి చేసిన ఈ పైత్యపు పని వల్ల పట్టాలపై మార్గమధ్యంలోనే పలు రైళ్లు ఆగిపోయాయి. రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి పలు రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. సమాచారం అందుకున్న శంకరపల్లి పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి ఎవరు..? ఎందుకిలా చేసింది..? మద్యం మత్తులో ఉందా..? ఈ కోణాల్లో పోలీసులు ఆరా తీశారు.