కరీంనగర్ జిల్లాలో జాబ్ పేరిట మోసగిస్తున్న ముఠాపై కేసు

 కరీంనగర్ జిల్లాలో జాబ్ పేరిట మోసగిస్తున్న ముఠాపై కేసు

హుజురాబాద్, వెలుగు: ఎన్పీడీసీఎల్, ఎన్టీపీసీల్లో జాబ్ లు ఇప్పిస్తామని పలువురిని మోసగించిన ముఠాపై కరీంనగర్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. హుజూరాబాద్ కు చెందిన మాడుగుల ప్రవీణ్, హుస్నాబాద్ కు చెందిన గుండెల్లి సంజీవ్, చిన్నపాపయ్యపల్లికి చెందిన  యాంసాని వీరేశం, మరికొందరు ఒక ముఠాగా ఏర్పడ్డారు. కొన్నాళ్లుగా ఎన్పీడీసీఎల్, ఎన్టీపీసీ, ఫారెస్ట్, పోస్టల్ డిపార్ట్ మెంట్లలో జూనియర్ అసిస్టెంట్, అటెండర్ జాబ్ లు ఇప్పిస్తామని నిరుద్యోగ యువతను మోసగిస్తున్నారు. హుజురాబాద్ కు చెందిన రాజేశ్, చంద్రశేఖర్, వేణుగోపాల్, అఖిల్, సురేశ్​తోపాటు మరికొందరిని నమ్మించారు.

 రామగుండం తీసుకువెళ్లి అక్కడ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను తీసుకుని,  నకిలీ అపాయింట్ మెంట్ లెటర్లు ఇచ్చారు. ఖర్చుల నిమిత్తం బాధితుల వద్ద కొంత డబ్బులు వసూలు చేశారు. ఒరిజినల్ ఆర్డర్ కాపీ పోస్టులో వస్తుందని చెప్పి పంపించేవారు. ఆ తర్వాత ఒక్కో వ్యక్తి వద్ద  జాబ్ కోసం రూ. 5 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. బాధితులు తమకు ఇచ్చిన లెటర్లను తెలిసినవారికి చూపించగా నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ అని తేలాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారిపై గతంలోనూ పలు పీఎస్ ల్లో కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే హుజురాబాద్ పీఎస్ లో సంప్రదించాలని ఎన్పీడీసీఎల్ విజిలెన్స్ సీఐ సాదుల్లాబాబా సూచించారు.