
బెంగుళూర్: ఆర్సీబీ విక్టరీ పరేడ్ సందర్భంగా బెంగుళూర్ లోని చినస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు బీసీసీఐ, ఆర్సీబీ ఫ్రాంఛైజ్ ప్రధాన కారణమని కర్నాకట ప్రభుత్వం ఆరోపించింది. ఆర్సీబీ వియోజత్సవ ర్యాలీకి ఫ్రాంచైజ్ యాజమాన్యం ప్రభుత్వ అనుమతి కోరలేదని ప్రభుత్వం వెల్లడించింది. తొక్కిసలాట ఘటనలో తమపై నమోదైన కేసులను సవాల్ చేస్తూ ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేతో సహా నలుగురు వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం (జూన్ 11) కర్నాకట హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ కేసును జస్టిస్ ఎస్ఆర్ కృష్ణ కుమార్ నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. కర్నాటక ప్రభుత్వం తరుఫున అడ్వకేట్ జనరల్ శశి కిరణ్ శెట్టి కోర్టులో వాదనలు వినిపించారు. ఎం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటకు బీసీసీఐ, ఆర్సీబీ యజమాన్యాలే కారణమన్నారు. ఆర్సీబీ విజయ పరేడ్ లేదా స్టేడియం లోపల సన్మాన వేడుకల కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని ఆయనకు కోర్టు వివరించారు.
సోషల్ మీడియా ద్వారా నిర్వాహకులు మొత్తం ప్రపంచాన్ని ఆహ్వానించారని చెప్పారు. విజయ పరేడ్కు గంటల ముందు ప్రభుత్వానికి సమాచారం అందించారని.. అప్పటికే వాళ్లు అనుమతి కోరలేదని.. కేవలం ఈవెంట్ వివరాలు మాత్రమే వెల్లడించారని వాదించారు. విక్టరీ ర్యాలీ, సన్మాన సభకు సంబంధించిన సమాచారం కేవలం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి మాత్రమే వచ్చిందని.. ఆర్సీబీ ఎలాంటి సమాచారం అందించలేదన్నారు.
జూన్ 3 రాత్రి 11.30 గంటల నుంచి జూన్ 4 ఉదయం వరకు ఆర్సీబీ సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టి విక్టరీ పరేడ్, సన్మాన సభలో చేరాలని అభిమానులను ఆహ్వానించిందని పేర్కొన్నారు. స్టేడియం కెపాసిటీ 33,000 ఉంటే.. 3.5 నుండి 4 లక్షల మంది స్టేడియం వద్దకు వచ్చారని.. అందులో ఎవరినీ లోపలికి అనుమతిస్తారో నిర్వాహకులు చెప్పలేదన్నారు. దీంతో స్టేడియం వద్ద గందరగోళ పరిస్థితులు నెలకొని తొక్కిసలాట జరిగిందని కోర్టుకు తెలియజేశారు.
ప్రేక్షకుల నియంత్రణ బాధ్యతను పూర్తిగా ఫ్రాంచైజీ, క్రికెట్ బోర్డుపై ఉంచిందన్నారు. ఆర్సీబీ యజమాన్యం వాస్తవాలను దాచి.. ప్రైవేట్ కార్యక్రమాన్ని ప్రభుత్వ ఈవెంట్ గా చూపించడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. కోర్టును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించారన్నారు. కాగా, ఐపీఎల్ లో ఆర్సీబీ తొలి టైటిల్ గెలవడంతో జూన్ 4 బెంగుళూర్లో విక్టరీ పరేడ్ నిర్వహించారు. ఫ్యాన్స్ భారీగా తరలిరావడంతో తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా.. మరో 50 మంది వరకు గాయపడ్డారు.