హిజాబ్ ధరించడంపై కర్ణాటక ప్రభుత్వం శుక్రవారం (డిసెంబర్ 22న) కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హిజాబ్ ధరించడంపై ఎటువంటి నిషేధం ఉండదని.. నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మైసూర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ విషయాన్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. తమకు నచ్చిన దుస్తులను మహిళలు ధరించవచ్చని తెలిపారు. హిజాబ్ ధరించి ఎక్కడికైనా వెళ్లవచ్చని, హిజాబ్పై బ్యాన్ను ఎత్తివేస్తున్నట్లు తెలిపారు. మహిళలు ఏ డ్రెస్ వేసుకుంటారు..? ఏం తింటారు..? అనేది వారి వ్యక్తిగత ఎంపిక అని సీఎం అన్నారు.
గత బీజేపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై హిజాబ్పై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే. దీనిపై కర్ణాటక హైకోర్టు.. హిజాబ్ ధరించడం విషయంలో ఇస్లాం మతపరంగా తప్పనిసరి ధరించాలన్న నియమం ఏం లేదని చెప్పింది. విద్యా సంస్థల్లో అందరూ ఒకేరకమైన దుస్తులు ధరించాలని హైకోర్టు వెల్లడించింది. విద్యాసంస్థల్లో హిజాబ్ బ్యాన్ నిర్ణయాన్ని కర్ణాటకలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం 2022లో అమల్లోకి తెచ్చింది.ఈ అంశం ఇప్పుడు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది.