
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) నమోదు చేసింది. జూన్ 5నజు మధ్యాహ్నం 2.30 గంటలకు విచారించనుంది. చీఫ్ జస్టిస్ వి. కామేశ్వరరావు, జస్టిస్ సి.ఎం. జోషిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. మరో వైపు ఈ ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు భద్రతా వైఫల్యాలు, పూర్తి సమాచారంతో వివరణాత్మక నివేదకను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవ సంబరాల్లో భాగంగా చిన్న స్వామి స్టేడియం వద్ద జూన 4న జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. వేల మంది అభిమానులు గేటు బద్దలు కొట్టి స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఈ తొక్కిసలాట జరిగింది. మృతుల్లో ఓ మహిళ, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఘటనలో 50 మందికి పైగా గాయపడ్డారు. వీరిని దగ్గర్లోని హాస్పిటల్స్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
18 ఏండ్ల తర్వాత ఆర్సీబీ జట్టు జూన్ 3న రాత్రి ఐపీఎల్ విజేతగా నిలవడంతో ప్లేయర్లందరికీ బుధవారం చిన్న స్వామి స్టేడియంలో కర్నాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) సన్మానం ఏర్పాటు చేసింది. దీన్ని చూసేందుకు లక్షల మంది స్టేడియం వద్దకు తరలి వచ్చారు. సమీపంలోని గోడలు, చెట్లు ఎక్కారు.సెక్యూరిటీ గార్డులు స్టేడియం గేట్ నంబర్ 3కు తాళాలు వేయడంతో అభిమానులంతా కలిసి వాటిని బద్దలు కొట్టారు. గేటుపై ఉన్నవాళ్లంతా ఒకరిపై ఒకరు కిందపడిపోయారు. దీంతో ప్రాణాలు కాపాడుకునేందుకు అందరూ పరుగులు పెట్టారు. ఫలితంగా తొక్కిసలాట జరిగింది.
తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. తొక్కిసలాట జరగడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. తమవాళ్లను కోల్పోయిన అందరికీ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు. గాయపడినవాళ్లంతా త్వరగా కోలుకోవాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు వివరించారు.