వెన్నులో చలి పుట్టించేది ప్రతిదీ హారరే : కార్తీక్ దండు

వెన్నులో చలి పుట్టించేది ప్రతిదీ హారరే  : కార్తీక్ దండు

సాయిధరమ్ తేజ్, సంయుక్తా మీనన్ జంటగా  కార్తీక్ దండు తెరకెక్కించిన మిస్టిక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’.  సుకుమార్ రైటింగ్స్‌‌తో కలిసి బీవీఎస్‌‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా కార్తీక్ దండు మాట్లాడుతూ ‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి జానర్‌‌‌‌కు నేను చిన్నప్పట్నుంచీ ఫ్యాన్. ఏడేళ్ల  క్రితం గుజరాత్‌‌లో ఓ మహిళ చేతబడి చేస్తుందన్న అనుమానంతో  చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేసిన వార్తను పేపర్‌‌‌‌లో చదివా.  దాన్నుండి ఈ కథ రెడీ చేసుకున్నాను. 

సుకుమార్ గారు కథ విని.. సాయితేజ్ దగ్గరకు పంపారు. స్ర్కీన్‌‌ప్లే విషయంలో ఆరు, ఏడు వెర్షన్లు ఇచ్చారు సుకుమార్.  క్లైమాక్స్‌‌లో ఆడియెన్స్ థ్రిల్‌‌ అయిన విషయాలు ఆయన చేసిన మార్పులే. హారర్‌‌ అంటే దెయ్యాలే కాదు. మనకు వెన్నులో చలి పుట్టించేది ప్రతిదీ హారరే.  కొత్తగా చూపించాలనే  ఉద్దేశ్యంతో మర్డర్ సీన్స్ డిఫరెంట్‌‌గా డిజైన్‌‌ చేశాం. సంయుక్తా మీనన్ చేసిన నందిని క్యారెక్టర్ సినిమాకి హైలైట్‌‌గా నిలిచింది. శివుడి వాహనం నంది. అందుకే ఆమె పాత్రకు నందిని అని పేరు పెట్టాం. 

రుద్రవనం, విరూపాక్ష కూడా శివుడి తాలూకు పేర్లే. చీకటిలో ఉండిపోయిన ఊరికి వెలుగులా వచ్చాడు అని హీరోకి సూర్య అని పేరు పెట్టా. యాక్సిడెంట్‌‌ నుంచి కోలుకున్న తర్వాత నటించిన సినిమా కావడంతో తేజ్ చాలా కష్టపడ్డారు. స్పీచ్‌‌ థెరపీ, డ్యాన్సు క్లాసులు చేసి పర్ఫెక్ట్‌‌గా షూటింగ్‌‌కి వచ్చారు. ఇండస్ట్రీ నుంచి చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి’ అని చెప్పాడు.