- వరించిన మైక్రోసాఫ్ట్ ‘మోస్ట్ వాల్యుబుల్ ప్రొఫెషనల్’ టైటిల్
ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదువుకోవాలనుకున్నాడు. కానీ, పేదరికం అడ్డు పడింది. కన్న కలలన్నింటినీ చిదిమేసింది. డిగ్రీ వైపు నడిపించింది. ఆ క్షణం అనుకున్నాడు. తనలా మరెవరూ డబ్బులేక నచ్చిన చదువుకి దూరం కావద్దని. తనలాంటి పరిస్థితి మరొకరికి వద్దని. ఆ మంచి ఆలోచనే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ‘ది మైక్రోసాఫ్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్రొఫెషనల్’ టైటిల్ తెచ్చిపెట్టింది అతనికి.
మన దేశం నుంచి ఈ ఘనత అందుకున్న ఐదో వ్యక్తిగా కసమ్ షేక్ని నిలబెట్టింది. అతని గురించి మరిన్ని విషయాలు. మైక్రోసాఫ్ట్ ఏటా ‘ది మైక్రోసాఫ్ట్ మోస్ట్ వాల్యుబుల్ ప్రొఫెషనల్’ పేరుతో అవార్డులు ఇస్తుంటుంది. ఇందులో స్పెషలేంటంటే.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కమ్యూనిటీ లీడర్స్కి ఈ అవార్డులు ఇస్తారు. అంటే ఎవరైతే వాళ్ల టెక్నికల్ నాలెడ్జ్ని యూజర్స్తో లేదా మైక్రోసాఫ్ట్తో షేర్ చేసుకుంటారో వాళ్లకి ఇస్తారు. రీసెంట్గా ఈ ప్రతిష్టాత్మక అవార్డుని ప్రపంచవ్యాప్తంగా 30 వేల మంది అందుకున్నారు. వాళ్లలో మన దేశానికి చెందిన 35 యేండ్ల కసమ్ షేక్ ఒకడు.
మహారాష్ట్రకి చెందిన కసమ్ షేక్కి చిన్నప్పట్నించీ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదవాలన్నది డ్రీమ్. కానీ, ఆ కలకి పేదరికం గండి కొట్టింది. తండ్రి చావు అతన్ని కంప్యూటర్ సైన్స్ వైపు నడిపించింది. అయినా నిరుత్సాహపడలేదు కసమ్. కష్టపడి చదివాడు. ఒక వైపు చదువుకుంటూనే ఉద్యోగం చేస్తూ కుటుంబ భారాన్ని మోశాడు. అతని హార్డ్వర్క్కి తగ్గట్టే గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ, ఆ తర్వాత అందరిలా తన కష్టాలన్నీ తీరిపోయాయని రిలాక్స్ కాలేదు కసమ్. తనలా డబ్బులేక నచ్చిన చదువుకి దూరమవుతున్న వాళ్ల గురించి ఆలోచించాడు. వాళ్లకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన నాలుగు బుక్స్ రాశాడు. ఇంజినీరింగ్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్గా తన నాలెడ్జ్ని షేర్ చేసుకున్నాడు. యూట్యూబ్ ద్వారా తన టెక్నికల్ నాలెడ్జ్ని షేర్ చేస్తున్నాడు. ఈ ప్యాండెమిక్లో ఏకంగా మైక్రో సాఫ్ట్ క్లౌడ్ మీద ఇరవైకి పైగా బుక్స్ ప్రింట్ చేశాడు. పేద విద్యార్థుల కోసం కసమ్ చేస్తున్న ఈ మంచి పనిని గుర్తించిన మైక్రోసాఫ్ట్ అతడ్ని ఈ అవార్డుతో గౌరవించింది.
