ఇండ్లు, స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడుతాం

ఇండ్లు, స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడుతాం
  •  తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసాని ఐలయ్య

జూలూరుపాడు, వెలుగు : పేద ప్రజలకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాడుతామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసాని ఐలయ్య అన్నారు. మండల కేంద్రంలో తెలంగాణ ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కంగాల బుచ్చయ్య భవనం నుంచి తహసీల్​ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అనేక మందికి ఇండ్లు, స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

ప్రభుత్వం స్వందించి పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయకపోతే, ప్రభుత్వ భూముల్లో ఎర్ర జెండాలు పాతి ఆ భూమిని పేదలకు పంచి పెడతామని హెచ్చరించారు. లేని పక్షంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు. ప్రోగ్రాంలో సీపీఎం మండల కార్యదర్శి యాసా నరేశ్, గడిదెసి కనకరత్నం, బానోత్ ఇస్ర, లకావత్, పద్దం సుగుణ, తాటి పద్మ, బానోత్ మధు, గార్లపాటి వెంకటి, వలమల చందర్రావు, గార్లపాటి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.