దొరల బలమా, ప్రజా బలమా చూసుకుందాం : కాటిపల్లి వెంకటరమణారెడ్డి

దొరల బలమా, ప్రజా బలమా చూసుకుందాం : కాటిపల్లి వెంకటరమణారెడ్డి
  •     కేసీఆర్ ​గజ్వేల్​ను వదిలి కామారెడ్డిలోనే పోటీ చేయాలి
  •     కామారెడ్డిలో సీఎం గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా
  •     బీజేపీ కామారెడ్డి ఇన్ చార్జి కాటిపల్లి వెంటకటరమణారెడ్డి సవాల్​

కామారెడ్డి, వెలుగు: కామారెడ్డిలో కేసీఆర్ ​గెలుపు ఖాయమైతే రెండు చోట్ల పోటీ చేయడం ఎందుకని, ఆయన గజ్వేల్​వదిలి కామారెడ్డిలో మాత్రమే పోటీ చేయాలని బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి​ కాటిపల్లి వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. కామారెడ్డిలో మాత్రమే కేసీఆర్ పోటీ చేసి గెలిస్తే, తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని, కేసీఆర్ ఓడిపోతే రాజకీయాలకు దూరంగా ఉండాలని వెంకటరమణారెడ్డి సవాల్ ​విసిరారు.

జిల్లా పార్టీ ఆఫీస్​లో ఆయన ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కామారెడ్డిలో కేసీఆర్​ను ఓడించి తీరుతామన్నారు. దొరల బలమా, ప్రజా బలమా చూసుకుందామన్నారు. ఇక్కడ కేసీఆర్​ గెలుపు ఖాయమైతే, బూత్​కు ఒక సీనియర్​ లీడర్​ను నియమించడం ఎందుకని కేటీఆర్​ను ప్రశ్నించారు. సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలకు కేటీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నేరెళ్ల ఘటన ప్రజల మదిలో మెదులుతూనే ఉంటుందన్నారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్​లో చేసిన అరాచకాలు చాలవన్నట్లు  కల్వకుంట్ల ఫ్యామిటీ కామారెడ్డిపై కన్నేసిందన్నారు.  

పదేండ్లుగా నియోజకవర్గానికి రూపాయి ఇవ్వని బీఆర్ఎస్​ నేతలు, ఇప్పుడు కేసీఆర్​ పోటీ చేస్తున్నారని కోట్ల రూపాయల ప్రోసిడింగ్స్​ ఇస్తున్నారన్నారు. కామారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్​ సభలో ఒక్క ఉద్యమ నాయకులు లేడని, కేసీఆర్ ​పోచమ్మ అయితే  కేటీఆర్, కవిత, హరీశ్​రావులు పోతరాజులు అని ఎద్దేవా చేశారు. కేటీఆర్​ ఇక్కడికి వస్తే తాను కరెంట్​తీగలు పట్టుకొని, సప్లయ్​ఎలా ఉందో చూపిస్తానన్నారు. టౌన్​ప్రెసిడెంట్ ​విఫుల్​జైన్, కౌన్సిలర్లు మోటూరి శ్రీకాంత్, నరేందర్, ప్రవీన్, లీడర్లు సురేశ్​తదితరులు పాల్గొన్నారు.