
- మెదక్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ రామాయంపేటలో..
- కౌడిపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ చింతకుంటలో..
- సౌకర్యాలు లేక స్టూడెంట్స్ ఇబ్బందులు
- ఏండ్లు గడుస్తున్నా సొంత భవనాలు కరువు
మెదక్/కౌడిపల్లి, వెలుగు: గత ప్రభుత్వ హయాంలో మెదక్ జిల్లాలో కొత్త డిగ్రీ కాలేజీలు మంజూరయ్యాయి. కానీ సొంత భవనాలు నిర్మించలేదు. ఖాళీగా ఉన్న ఇతర భవనాల్లో కాలేజీలు ప్రారంభించారు. దీంతో తరగతి గదులు, హాస్టల్ గదులు లేక నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కౌడిపల్లిలో 2023లో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మంజూరైంది. కానీ భవనం అందుబాటులో లేదని నర్సాపూర్ మండలం చింతకుంటలోని నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ బిల్డింగ్ లో ఏర్పాటు చేశారు. అడ్మిషన్ల ప్రక్రియ, తరగతులను అక్కడే నిర్వహిస్తున్నారు. దీంతో కౌడిపల్లిలో డిగ్రీ కాలేజీ మంజూరైందన్న పేరే తప్ప కాలేజీ అందుబాటులో లేకపోవడంతో స్టూడెంట్స్తీవ్ర నిరాశకు గురవుతున్నారు.
చుట్టు పక్కల గ్రామాల స్టూడెంట్స్ఆటోలో కౌడిపల్లికి వచ్చి అక్కడి నుంచి ఆర్టీసీ బస్లో చింత కుంటకు వెళ్లాలి. సమయానికి బస్సులు లేక పోవడంతో స్టూడెంట్స్కాలేజీకి వెళ్లి రావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌడిపల్లి డిగ్రీ కాలేజీలో చేరేందుకు స్టూడెంట్స్ఇష్టపడడం లేదు. గతేడాది కేవలం 60 మంది స్టూడెంట్స్మాత్రమే అడ్మిషన్లు తీసుకున్నారు. ఏర్పాటై మూడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు డిగ్రీ కాలేజీని కౌడిపల్లికి తరలించలేదు.
కాలేజీ మంజూరైన మొదట్లో మాజీ ఎమ్మెల్యే కు చెందిన కాంప్లెక్స్ లో డిగ్రీ కాలేజీ ప్రారంభించాలనుకున్నారు. బోర్డు సైతం ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. రెండోసారి స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో షిఫ్టింగ్ పద్ధతిలో డిగ్రీ కాలేజీ నిర్వహించేందుకు రంగం సిద్ధం కాగా జూనియర్ కాలేజీ స్టూడెంట్స్అడ్డు చెప్పారు. దీంతో మరోసారి వాయిదా పడింది. దీంతో చింతకుంటలోనే డిగ్రీ కాలేజీ కొనసాగుతోంది. ఇప్పుడు మూడో సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైనప్పటికీ కౌడిపల్లిలో డిగ్రీ కాలేజీ అందుబాటులోకి రాకపోవడంతో స్టూడెంట్స్కాలేజీలో చేరేందుకు వెనుకాడుతున్నారు.
కౌడిపల్లి బాలికల హై స్కూల్పక్కన బీసీ హాస్టల్ భవనం ఖాళీగా ఉంది. ఇందులో 12 గదులు ఉన్నాయి. రిపేర్లు చేస్తే సొంత భవనం నిర్మించే వరకు డిగ్రీ కాలేజీని అందులో నిర్వహించవచ్చని స్థానికులు అంటున్నారు. అధికారులు మాత్రం ఆ భవనం శిథిలావస్థకు చేరిందని అందులో కాలేజీ నిర్వహించడం కష్టమని చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి కౌడిపల్లి డిగ్రీ కాలేజీకి సొంత భవనం మంజూరు చేయాలని స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఉమెన్స్ డిగ్రీ కాలేజీ మూడు చోట్లకు మార్పు
మెదక్ పట్టణంలో 2016లో సోషల్వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఉమెన్స్ డిగ్రీ కాలేజీ మంజూరైంది. ఓ ఏడాది పాటు స్టేడియం రోడ్ లోని ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు చెందిన బిల్డింగ్లో కాలేజీ నిర్వహించారు. ఆ తర్వాత 2017లో కొల్చారానికి తరలించారు. అక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించిన హాస్టల్ బిల్డింగ్ లో డిగ్రీ కాలేజీని నిర్వహించారు. స్టూడెంట్స్సంఖ్యకు అనుగుణంగా సదుపాయాలు లేకపోవడంతో నిర్వహణ కష్టంగా మారింది.
ఓ దశలో కొల్చారంలో కొనసాగుతున్న కాలేజీని ఘట్కేసర్తరలించే ప్రయత్నం జరిగింది. స్టూడెంట్స్, తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో అధికారులు ఆ ప్రయత్నం విరమించుకున్నారు. 2017 నుంచి ఏడేళ్ల పాటు కొల్చారంలో కొనసాగిన కాలేజీని 2023 ఏప్రిల్లో రామాయంపేటకు తరలించారు. 7 గ్రూప్లలో 660 మంది స్టూడెంట్స్ఉండగా సరైన వసతి లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రామాయంపేట పట్టణంలో 2 క్యాంపస్లలో కాలేజీని నిర్వహిస్తున్నారు. ఆర్ట్స్ గ్రూప్లను వాణి విద్యాలయంలో, సైన్స్ గ్రూప్లను వాసవి జూనియర్ కాలేజీ బిల్డింగ్లో నిర్వహిస్తున్నారు. కాలేజీ మంజూరై పదేళ్లు కావస్తున్నా ఇంతవరకు సొంత బిల్డింగ్ నిర్మించకపోవడం గమనార్హం.
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
కౌడిపల్లి డిగ్రీ కాలేజీ నర్సాపూర్ మండలం చింతకుంటలో కొనసాగుతోంది. అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు ఉన్నారు. రెండుసార్లు కౌడిపల్లిలో ప్రారంభించేందుకు ప్రయత్నించినా వాయిదా పడింది. కాలేజీ చింతకుంటలో ఉండడం వల్ల స్టూడెంట్స్ఇబ్బందిపడుతున్నారు. కౌడిపల్లిలో డిగ్రీ కాలేజీ ఉంటే స్టూడెంట్స్కు దూర భారం తగ్గుతుంది. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
దామోదర్, ఇన్చార్జి ప్రిన్సిపాల్