- అసెంబ్లీలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు
- కౌంటర్ఇచ్చిన మంత్రులు వాకిటి, అడ్లూరి
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి తన మనవడి సంబరం కోసమే ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చారని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులను ఖర్చు చేశారని విమర్శించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా బుధవారం రాత్రి కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారు.
టీ20 ప్రపంచకప్లో గెలిచిన టీమ్ మెంబర్ తిలక్ వర్మకు, ఫాస్టెస్ట్ 100 వికెట్లు తీసిన రిటైర్డ్ బౌలర్ ప్రజ్ఞాన్ ఓజా, ఉమెన్స్ అండర్19 వరల్డ్ కప్ టీమ్ మెంబర్ ద్రితి, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్గుత్తా జ్వాలకు ప్రభుత్వం తరపున రూ.కోటి నగదు పురస్కారం, 500 గజాల ప్రభుత్వ స్థలాన్ని అందించాలని కోరారు. వీరంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫేమస్ క్రీడాకారులని చెప్పారు.
యూత్ డిక్లరేషన్లో చెప్పినట్లుగా అధికారంలోకి రాగానే ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాల సంగతేంటని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి మాటలకు మంత్రులు వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. ‘మెస్సీ ప్రపంచ స్థాయి ఫుట్బాలర్. ఆయన హైదరాబాద్కు వచ్చాక రాష్ట్రానికి ప్రపంచంలో గుర్తింపు పెరిగింది’ అని మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వ హయంలో ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో ఓయూలో అడుగు కూడా పెట్టలేకపోయిన బీఆర్ఎస్ లీడర్లు నిరుద్యోగం గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు పలికినట్లుగా ఉంది’ అని మంత్రి అడ్లూరి విమర్శించారు.
