రెండేండ్ల నుంచి ‘పాలమూరు’ పనులు ముందుకు సాగలే

రెండేండ్ల నుంచి ‘పాలమూరు’  పనులు ముందుకు సాగలే
  • కేసీఆర్​ హయాంలోనే 80 శాతం పనులు పూర్తి: కవిత
  • సొంత జిల్లాకు  సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి అన్యాయం చేస్తున్నారని కామెంట్​
  • ఉద్దండాపూర్, కరివెన రిజర్వాయర్ల సందర్శన

మహబూబ్​నగర్​/జడ్చర్ల, వెలుగు : కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా పాలమూరు– -రంగారెడ్డి లిఫ్ట్​ ఇరిగేషన్​ పనులు అడుగు కూడా ముందుకు పడలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్​హయాంలోనే 80 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. ఆ పనులను వెంటనే పూర్తిచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. మంగళవారం ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని షాద్‌‌‌‌‌‌‌‌నగర్​, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో కవిత పర్యటించారు. 

ముందుగా షాద్‌‌‌‌‌‌‌‌నగర్​ చేరుకున్న ఆమె అక్కడి మహిళలతో మాట్లాడారు. ఆ తర్వాత పాలమూరు లిఫ్ట్​ స్కీమ్‌‌‌‌‌‌‌‌లో భాగమైన ఉద్దండపూర్​ రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. అక్కడి భూ నిర్వాసితులతో సమావేశమై, వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం కరివెన రిజర్వాయర్​ను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో కవిత మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్టుకు కేసీఆర్​ డిజైన్​ చేశారని, 80 శాతం పనులు పూర్తి చేశారని చెప్పారు. మిగిలిన పనులను కాంగ్రెస్​రెండేండ్లుగా చేపట్టడం లేదన్నారు. నార్లాపూర్-, ఏదుల మధ్య టన్నెల్​ పనులు చేయలేదని, ఉద్దండాపూర్​, కరివెన రిజర్వాయర్లలో తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని చెప్పారు. ఈ ప్రాజెక్టును సుప్రీంకోర్టు సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌లో పెట్టిందని, అయినా కాంగ్రెస్​ ప్రభుత్వం రివ్యూ పిటిషన్​ కూడా వేయలేదని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మాట్లాడడం లేదన్నారు. పాలమూరు పులి బిడ్డను అని చెప్పుకునే ఆయన సొంత జిల్లాకే తీరని అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  పాలమూరు జిల్లాకు కాంగ్రెస్​ చారిత్రక అన్యాయం చేస్తున్నదని, ప్రజలు వారిని క్షమించరని అన్నారు.