బీఆర్ఎస్ తప్పులకు కవిత సారీ!..పదేండ్లలోని తప్పులు, అన్యాయాలు ‘జనం బాట’లో ప్రస్తావన

బీఆర్ఎస్ తప్పులకు కవిత సారీ!..పదేండ్లలోని తప్పులు, అన్యాయాలు ‘జనం బాట’లో ప్రస్తావన
  •     వాటికి తనను క్షమించాలంటూ ప్రజలకు వేడుకోలు
  •     రాజకీయాల్లో హాట్​ టాపిక్​ 

హైదరాబాద్​, వెలుగు: బీఆర్​ఎస్​ పదేండ్ల పాలనలోవివిధ వర్గాలకు జరిగిన అన్యాయంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సారీ చెప్తున్న తీరు రాజకీయవర్గాల్లో హాట్​ టాపిక్​గా మారింది. బీఆర్ఎస్​ నుంచి బహిష్కరణకు గురైన ఆమె.. జాగృతి జనం బాట కార్యక్రమంతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో.. గత బీఆర్​ఎస్​ హయాంలో జరిగిన తప్పులన్నింటినీ కవిత ప్రస్తావిస్తున్నారు. 

వాటిని జనం కూడా ఆమె దృష్టికి తెస్తున్నారు. అప్పుడు తాను అదే పార్టీలో ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితుల వల్ల ఏమీ మాట్లాడలేకపోయానని, ఇందుకు తనను క్షమించాలని ప్రజలను కవిత వేడుకుంటున్నారు. బీఆర్​ఎస్​ హయాంలో రైతులు, ఉద్యమకారులు, బీసీలు తీవ్ర అన్యాయానికి గురయ్యారని.. ఆయా వర్గాలను కలిసినప్పుడు వారికి ఆమె క్షమాపణలు చెప్తున్నారు.  

ఉద్యమకారులతో మొదలు..!

పార్టీ నుంచి బహిష్కరించాక.. కవిత అక్టోబర్​ నుంచి జాగృతి జనంబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత గన్​పార్క్​ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అక్కడ మాట్లాడిన ఆమె.. ప్రాణాలు అర్పించి, ప్రాణాలకు తెగించి కొట్లాడి రాష్ట్రం తెచ్చిన అమరులు, ఉద్యమకారులను బీఆర్​ఎస్​ పాలనలో పట్టించుకోలేదన్నారు. అప్పుడు తాను కూడా అమరులు, ఉద్యమకారుల కోసం కొట్లాడలేదని చెప్తూనే.. వారికి  తన తరఫున క్షమాపణలు తెలియజేశారు. 

బీఆర్​ఎస్​ పాలనలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు పోరాటం చేస్తానని తెలిపారు. ఇటు బీసీల కోసం ఉద్యమించిన సందర్భంగా కూడా బీఆర్​ఎస్​ తీరుపై ఆమె తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్​ చుట్టూ దెయ్యాలున్నాయని అనడం, ఆ తర్వాత పార్టీ పెద్దలు, తన అన్న, బావతోపాటు పార్టీ తీరుపై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అక్కడి నుంచే బీసీల కోసం ఉద్యమం చేస్తానని ప్రకటించారు. 

అందులో భాగంగానే ధర్నాచౌక్​ వద్ద బీసీ సంఘాలతో ధర్నా చేపట్టారు. బీసీలకు బీఆర్​ఎస్​ పార్టీ తీరని ద్రోహం చేసిందని ఈ సందర్భంగా ఆమె మండిపడ్డారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధిలో రిజర్వేషన్లను పెంచేందుకు.. వారి భాగస్వామ్యాన్ని పెంచేందుకు బీఆర్​ఎస్​ హయాంలో ప్రయత్నాలు చేసిన దాఖలాలు లేవని తెలిపారు. ఇందుకు బీసీలకు తాను క్షమాపణలు చెప్తున్నట్లు పేర్కొన్నారు.  

తాజాగా రైతులు, నిర్వాసితులకు..!

గత బీఆర్​ఎస్​ పాలనలో రైతులకు బేడీలు వేసి తీసుకెళ్లడం, గిరిజన మహిళా రైతులను జైలుకు పంపడం వంటి ఘటనలు అనేకం జరిగాయి. ఇటు ట్రిపుల్​ ఆర్​లో భూములు కోల్పోయిన రైతులపైనా కేసులు పెట్టారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో కవిత పర్యటించిన సందర్భంగా ట్రిపుల్​ ఆర్​ భూ నిర్వాసితులు, రైతులతో మాట్లాడారు. ట్రిపుల్​ ఆర్​ అలైన్​మెంట్​మార్చాలని పోరాడిన తమపై బీఆర్​ఎస్​ హయాంలో కేసులు పెట్టి బేడీలు వేయించారని ఆమె ముందు రైతులు వాపోయారు. దీంతో.. నాడు రైతులకు బేడీలు వేసిన విషయం తనకు తెలియదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. 

ఈ విషయం తన దృష్టికే రాలేదని, తెలిసుంటే పోరాడేదానని చెప్పారు. ఇందుకు తనను క్షమించాలని ఆమె కోరారు. బీఆర్​ఎస్​ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, నిర్వాసితులకు సరైన పరిహారమూ అందలేదన్నారు. ఈ క్రమంలోనే.. వారి తరఫున పోరాడుతానని, అవసరమైతే అలైన్​మెంట్​మార్చేందుకు కేంద్ర మంత్రి గడ్కరీ అపాయింట్​మెంట్​ కోరుతానని హామీ ఇచ్చారు.