- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం అలైన్మెంట్ మార్చారు
- ఎవరో ఏదో చెబితే తనను పార్టీలోంచి
- కేసీఆర్ తీసేశారని కామెంట్
- యాదాద్రి జిల్లాలో జాగృతి జనంబాట
యాదాద్రి, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన విషయం తనకు తెలియదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. తెలిసి ఉంటే రైతులపక్షాన తాను కొట్లాడేదాన్ని అని పేర్కొన్నారు. ‘‘బీఆర్ఎస్లోనే ఉండి మీ కోసం కొట్లాడనందుకు నన్ను క్షమించండి” అని ట్రిపుల్ ఆర్ నిర్వాసితులను కోరారు.
మంగళవారం జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కవిత పర్యటించారు. ముందుగా ఎయిమ్స్హాస్పిటల్ను ఆమె సందర్శించారు. ఇప్పటివరకూ పూర్తిస్థాయి ట్రీట్మెంట్ అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చినా కాంట్రాక్టర్ పనులు చేయడం లేదన్నారు. అనంతరం రాయగిరిలో ట్రిపుల్ ఆర్ నిర్వాసితులను కలిశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘రింగ్ లేదు.. ఏమీ లేదు. ఎవరికి ఇష్టమొచ్చినట్టు వారు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ను తిప్పారు. మూడుసార్లు దాన్ని మార్చారు. యాదగిరిగుట్ట అవతలినుంచి రావాల్సిన రోడ్డును ఇవతలికి మార్చారు. ట్రిపుల్ఆర్అలైన్మెంట్ మార్పు వెనుక పెద్ద అవినీతి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భూములు కాపాడడం కోసం అలైన్మెంట్ మార్చి రైతులకు అన్యాయం చేశార”
అని ఆరోపించారు.
అలైన్మెంట్ మార్పుకోసం కొట్లాడుదాం..
అలైన్మెంట్లో గుంటభూమి కూడా పోనీయనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారని కవిత తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దని, అందరం కలిసి అలైన్మెంట్మార్పుకోసం కొట్లాడుదామని చెప్పారు. జనవరి 4న హైదరాబాద్లో ట్రిపుల్ ఆర్ నార్త్, సౌత్ భాగాల కోసం భూములు కోల్పోయే నిర్వాసితులతో మీటింగ్ ఏర్పాటు చేస్తానని తెలిపారు.
కేసీఆర్కు నాపై ఎవరో కల్పించి చెప్పారు..
బీఆర్ఎస్ కోసం తాను 20 ఏండ్లు పని చేశానని కవిత అన్నారు. ‘‘నాపై ఎవరికి కోపం వచ్చిందో.. ఎవరు ఎక్కించి చెప్పారో తెలియదు.. కేసీఆర్ నన్ను పార్టీలోంచి తీసేశారు” అని పేర్కొన్నారు. పార్టీ నుంచి తీసేసినా ప్రజల మీద భరోసాతో కొట్లాడుదామని వచ్చానని చెప్పారు. సామాజిక తెలంగాణ రావాలని కోరుకున్నానని, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కొందరికే మేలు జరిగిందని, ప్రజల జీవితాల్లో మార్పేమీ రాలేదన్నారు. దళితుల భూములు కబ్జాకు గురయ్యాయని ఆరోపించారు.
