- నిరుడు డిసెంబర్లో ఐప్యాక్ ఫౌండర్తో కవిత 2 రోజులు మంతనాలు
- ఇటీవల సంక్రాంతి పండుగ టైంలోనూ 5 రోజులపాటు చర్చలు
- పీకే సలహా మేరకే జాగృతిలో 50 కమిటీల ఏర్పాటు
- సమగ్ర నివేదిక కోసం కమిటీలకు 20 రోజులు గడువిచ్చిన కవిత
హైదరాబాద్, వెలుగు: ఇన్నాళ్లూ కేసీఆర్ కూతురు అనే ముద్రతో రాజకీయాల్లో చలామణి అయిన కవిత.. ఇప్పుడు అందులోంచి బయటపడి.. కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఆ పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఐప్యాక్ ఫౌండర్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే)తో ఆమె జట్టు కడుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆమె రెండు నెలల్లో పలు దఫాలు పీకేతో సంప్రదింపులు జరిపారు. నిరుడు డిసెంబర్లో తొలిసారి హైదరాబాద్కు పీకే వచ్చి.. కవితను కలిసినట్టు తెలిసింది. అప్పుడు రెండు రోజుల పాటు ఇక్కడే ఉండి చర్చలు జరిపినట్టు సమాచారం. ఇక ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలోనూ హైదరాబాద్ వచ్చిన పీకే.. దాదాపు 5 రోజులు ఇక్కడే ఉండి.. కవితతో రాజకీయ పార్టీ ఏర్పాటు, వ్యూహాలపై చర్చించినట్టు తెలిసింది. ప్రస్తుతం బీఆర్ఎస్ బలహీనంగా మారడం, బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడంలాంటి పరిస్థితుల్లో కొంచెం ఎఫర్ట్స్ పెడితే మరో పార్టీపెట్టి ఎదగొచ్చని కవిత భావిస్తున్నారు. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకేలాంటి పార్టీలకు ఓ ఊపు తెచ్చిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పీకేతో జట్టు కడితే మంచి ఫలితాలు సాధించొచ్చనే అంచనాతో ఆయనతోనే కవిత నేరుగా సంప్రదింపులు జరుపుతున్నారు.
ఆయన సూచనల మేరకే కమిటీలు?
పార్టీ జెండా, ఎజెండా ఎలా ఉండాలన్న దానిపై ప్రజా అభిప్రాయాలు తెలుసుకునేందుకు కవిత ఇటీవల 50 జాగృతి కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నిరుడు డిసెంబర్లో కవితను కలిసినప్పుడు పీకే చేసిన సూచనల మేరకే ఈ కమిటీల ద్వారా ప్రజల మనోగతాన్ని కవిత అధ్యయనం చేయించినట్టు సమాచారం. ఆ కమిటీలు అందజేసిన రిపోర్టులపై జాగృతి నేతలతోపాటు నిపుణులతో ఇప్పటికే ప్రాథమికంగా చర్చించారు. ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలో పీకేతో సమావేశమైనప్పుడు వీటిని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. తాజాగా పార్టీ ఏర్పాటు విషయంపై సోమవారం జాగృతి నేతలు, 50 కమిటీల ప్రతినిధులతో కవిత కీలక సమావేశం నిర్వహించారు. ఆయా కమిటీలు సమర్పించిన ప్రిలిమినరీ రిపోర్టుల్లోని అంశాలు అసమగ్రంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలోనే సమగ్ర రిపోర్టు సమర్పించేందుకు కమిటీలకు మరో 20 రోజుల టైమ్ఇచ్చారు. కొద్ది రోజుల్లోనే పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆమె కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే పార్టీ పేరును ప్రకటించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉన్న తెలంగాణ జాగృతినే రాజకీయ పార్టీగా ముందుకు తీసుకెళ్లే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.
గతంలో బీఆర్ఎస్తో..
రాష్ట్రంలో పీకే రాజకీయ వ్యూహ రచనలు చేయడం ఇదే తొలిసారి కాదు. 2023 సాధారణ ఎన్నికల కోసం బీఆర్ఎస్కు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. వాస్తవానికి ఐప్యాక్ సంస్థ.. బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా వరకు గ్రౌండ్ వర్క్ కూడా చేసింది. వందల మంది సిబ్బందిని నియమించుకొని గ్రామాలు, పట్టణాల్లో సర్వేలు నిర్వహించింది. సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేపట్టింది. బీజేపీ, కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేసింది. కానీ, 6 నెలలు తిరగకముందే ఐప్యాక్, బీఆర్ఎస్ పార్టీ మధ్య ఒప్పందం రద్దయింది. కేటీఆర్కు ఐప్యాక్ విధానాలు నచ్చకపోవడం.. క్యాంపెయిన్ వ్యూహాలు సరిగ్గా లేవని చెప్పడంతో తేడా కొట్టినట్టు చెప్తారు. ఆ సమయంలో కవిత బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. తదనంతర పరిణామాలతో ఆమె పార్టీ నుంచి బయటకు వచ్చారు.సమయం దొరికినప్పుడల్లా తన తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ హరీశ్రావులే టార్గెట్గా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. బీఆర్ఎస్ పార్టీకి దీటుగా ఎదిగేందుకు ఆమె సొంతంగా పార్టీ పెట్టి ముందుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.
