- 58 మందికి గాయాలు
- కజకిస్తాన్లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే క్రాష్
- రెండు ముక్కలైన విమానం
ఆల్మటీ(కజికిస్తాన్): కజికిస్తాన్లోని ఆల్మటీ దగ్గర ఘోర విమాన ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం ఆల్మటీ ఎయిర్పోర్ట్ నుంచి నూర్– సుల్తాన్కు బయలుదేరిన బెక్ ఎయిర్కు చెందిన ఫోకర్ – 100 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలెట్ సహా12 మంది చనిపోగా.. మరో 58 మందికి బాగా దెబ్బలు తగిలాయి. వారిలో 10 మంది పరిస్థితి సీరియస్గా ఉంది. వాళ్లకు దగ్గరల్లోని హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో తొమ్మిది మంది పిల్లలు కూడా ఉన్నారు. చనిపోయిన వారిలో ఒక మహిళా జర్నలిస్ట్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ప్రమాదం జరిగినప్పుడు విమానంలో 100 మంది ఉన్నారు. వారిలో 95 మంది ప్యాసింజర్లు, ఐదుగురు సిబ్బంది . టేకాఫ్ అయిన కొద్ది సేపటికే రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. దగ్గర్లోని రెండు అంతస్తుల బిల్డింగ్లోకి దూసుకెళ్లిందని, ఆ టైంలో ఇంట్లో ఎవరు లేరని స్థానిక మంత్రి చెప్పారు. ఒక్కసారిగా బలంగా ఢీకొట్టడంతో విమానం రెండు ముక్కలైందని, ముందు వరుసలో కూర్చున్న వారు చనిపోయారని డిప్యూటీ ప్రైమ్మినిస్టర్ రోమన్ స్కిల్యార్ చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని అన్నారు. ప్రమాదానికి సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేశారు. కాక్పిట్ కోసం వెతుకుతున్నామని, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. దీనిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్కు ఆదేశించారు.
ఈ ఘటనపై ప్రెసిడెంట్ కసీం జోమార్ట్ టొకాయేవ్ స్పందించారు. బాధితుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. ప్రమాదానికి గురైన ఫోకర్ – 100 ప్లేన్ 23 ఏళ్ల క్రితందని, ఈ ఏడాది మేలో నిర్వహించిన సేఫ్టీ చెక్లో కూడా పాస్అయిందని అధికారులు చెప్పారు. 1999లో స్టార్ట్ అయిన బెక్ ఎయిర్ మొదట వీఐపీ సర్వీసులను ప్రారంభించి ఆ తర్వాత సాధారణ సేవల్ని స్టార్ట్ చేసింది. దేశంలోనే లోకాస్ట్ ఎయిర్లైన్స్గా దీనికి పేరు ఉంది.