కేసీఆర్ ఫాంహౌస్ ను తనిఖీ చేయాలి

కేసీఆర్ ఫాంహౌస్ ను తనిఖీ చేయాలి

సీఎం  కేసీఆర్ ఫాంహౌస్ దాటి బయటకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. కేసీఆర్ ఫాంహౌస్ లో ఏదో ఉందని… తనిఖీలు చేయాల్సిందేనన్నారు. సోదాలు నిర్వహిస్తే ఏదో ఒకటి బయటపడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫాంహౌస్ లో కేసీఆర్ కచ్చితంగా ఏదో దాచారని… అందుకే ఎప్పుడూ అక్కడకు వెళ్తుంటారన్నారు. బండి సంజయ్ ని ఇవాళ(శనివారం) ఆదిలాబాద్ జిల్లా రైతులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం రాష్ట్ర ప్రజల ఆలోచన ఒకటేనని… టీఆర్ఎస్ ను గద్దె దించి, బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనేదే అందరి లక్ష్యమన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ ఎవరి కోసం పని చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులను సీఎం పట్టించుకోవడం మానేశారన్నారు. మైలార్ దేవ్ పల్లి బీజేపీ కార్పొరేటర్ పై దాడి చేశారని… తాము తిరిగి దాడి చేయడం పెద్ద విషయమేమీ కాదని సంజయ్ హెచ్చరించారు. తాము తలచుకుంటే టీఆర్ఎస్ నేతలు తిరగలేరని హెచ్చరించారు. ప్రగతి భవన్ కు వచ్చిన రైతులపై పోలీసులు దాడి చేశారని… ఫిట్స్ వచ్చినా నాలుగు గంటల పాటు పోలీస్ స్టేషన్ లోనే ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.