ఎర్రగడ్డలో ‘వైరస్‌‌’ దవాఖానా

ఎర్రగడ్డలో ‘వైరస్‌‌’ దవాఖానా

హైదరాబాద్​, వెలుగు:

ఐదేండ్ల క్రితం ఎబోలా వైరస్​ ప్రపంచాన్ని వణికించింది. ఆ తర్వాత జికా అంటూ మరొకటి ముప్పు తిప్పలు పెట్టింది. అది ఉన్నప్పుడే స్వైన్​ఫ్లూ వచ్చేసింది. ఇప్పుడు కొత్తగా కరోనా వైరస్​ పుట్టుకొచ్చింది. ఒకదానిని మించి ఒక వైరస్​ వందల మందిని పొట్టనపెట్టుకుంటున్నాయి. అలాంటి వైరస్​లను ఎదుర్కొనేందుకు ప్రత్యేక దవాఖానా ఉంటే ఎట్లుంటది? అందుకే అలాంటి ఒక హాస్పిటల్​ను అందుబాటులోకి తీసుకురాబోతోంది రాష్ట్ర సర్కారు. కొత్త వైరస్​లు వచ్చినప్పుడే హడావుడిగా ఐసోలేషన్​ వార్డులు ఏర్పాటు చేయకుండా, వైరస్​ల కోసమే ఓ ప్రత్యేక దవాఖానాను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఐసోలేషన్​ వార్డులు, వెంటిలేటర్​‌‌ ఐసీయూ వార్డులతో ఎర్రగడ్డలోని చెస్ట్​ ఆస్పత్రి ప్రాంగణంలో ఆ హాస్పిటల్​ను నిర్మించేందుకు రెండేండ్ల క్రితమే ఆరోగ్య శాఖ అధికారులు ప్లాన్​ను సిద్ధం కూడా చేశారు. అయితే, బడ్జెట్​ లేకపోవడంతో అది అమలుకు నోచుకోలేదు. ప్రస్తుతం ఢిల్లీ, పుణేలో మాత్రమే ఇలాంటి దవాఖానాలు ఉన్నయి. వీటిని ‘క్లీన్​ వార్డ్​’లుగా పిలుస్తారు. ఇలాంటి ఆస్పత్రులను కట్టేందుకు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ఓ ఉన్నతాధికారి వివరించారు. ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదనలు పంపడంతో, కేంద్రం నుంచి ఓ టీమ్​ వచ్చి చెస్ట్​ హాస్పిటల్​లో ‘క్లీన్​ వార్డు’ కట్టాలనుకున్న ప్రాంతాన్ని చూసి ఓకే చేసిందన్నారు. వైరస్​లను ఎదుర్కొనేందుకు ఓ ప్రత్యేక బ్లాక్​ను కడుతున్నట్టు మంత్రి ఈటల రాజేందర్​ కూడా మీడియాకు వెల్లడించారు.

ఇట్లుంటది ‘క్లీన్​వార్డు’

ఐదెకరాల్లో నాలుగు లేయర్లుగా క్లీన్​ వార్డును కడతారు. ఇందులో 5 ఐసోలేషన్​ వార్డులుంటాయి. మొత్తం వార్డులు కలిపి 50 నుంచి 60 బెడ్లుంటాయి. అనుమానిత కేసులను ఈ వార్డుల్లోనే అబ్జర్వేషన్​లో పెడతారు. 12 బెడ్లతో కూడిన వెంటిలేటర్​ ఐసీయూ వార్డ్​ ఒకటి ఉంటుంది. వైరస్​ ఉన్నట్టు రూఢీ అయితే ఈ వార్డులోకి పేషెంట్​ను షిఫ్ట్​ చేసి ట్రీట్​మెంట్​ చేస్తారు. ఒకరి నుంచి ఒకరికి వైరస్​ సోకకుండా చర్యలు తీసుకుంటారు. ఈ హాస్పిటల్​లోకి పేషెంట్లు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన డాక్టర్లు, స్టాఫ్​ను మాత్రమే అనుమతిస్తారు. బయటి నుంచి తొలి రెండు వార్డుల వరకే వార్డ్​బాయ్స్​కు అనుమతి ఉంటుంది. డాక్టర్లు, నర్సులను మాత్రమే ఐసోలేషన్​ వార్డుల్లోకి రానిస్తారు. ప్రతి వార్డుకి సెంట్రల్​ గైడ్​లైన్స్​, ప్రొటోకాల్​ పాటించాల్సి ఉంటుంది. వార్డులోకి వెళ్లాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎంట్రెన్స్​లో బోర్డులపై రాసి ఉంచుతారు. ఆ నిబంధనలు పాటించకుండా లోపలికి ఎవరినీ అనుమతించరు.