జనగామ , సూర్యాపేట జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు మాజీ సీఎం కేసీఆర్ . ఇవాళ ఉదయం ఎర్రవెళ్లి ఫామ్ హౌజ్ నుంచి బయల్దేరిన కేసీఆర్ ముందుగా జనగామ పాలకుర్తి నియోజకవర్గం దేవరప్పుల మండలం దారవత్ తండాలో ఎండిపోయిన పంటపొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడిన కేసీఆర్.. సమస్యలు , వరి పంట స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. రైతు సత్తవ్వతో మాట్లాడి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల తరుపున బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
అనంతరం పాలకుర్తి నుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తికి వెళ్లిన కేసీఆర్... అర్వపల్లి, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకుని అక్కడే కేసీఆర్ భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియాతో మాట్లాడుతారు.
మధ్యాహ్నం 3:30కు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నుంచి నల్లగొండ జిల్లాకు బయల్దేరుతారు. సాయంత్రం 4:30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి తిరిగి ఎర్రవెల్లికి బయల్దేరతారు. రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి రాత్రి 9 గంటలకు ఫాంహౌజ్ చేరుకుంటారు.