ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొడుతున్నడు

ఓటమి భయంతోనే కేసీఆర్ రెండు రాష్ట్రాల ప్రజలను రెచ్చగొడుతున్నడు

మేడ్చల్ జిల్లా: కాంగ్రెస్ దళిత బంధు పేరుతో ప్రశ్నిస్తుంటే.. కేసీఆర్ ఓడిపోతాననే భయంతో తిరిగి తెలంగాణ ఆంధ్ర ప్రజలని రెచ్చగొట్టి ప్రయోజనం పొందలనుకుంటున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్  ఓటమిలేని నేత ఎంత మాత్రం కాదని, ఓ సారి ఎమ్మెల్యే గా,  సింగిల్ విండో డైరెక్టర్ గా పోటీ చేసి ఓడిపోయారని ఆయన తెలిపారు. కొంపల్లిలోని పీఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో  బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్  రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి క్రియాశీల పాత్ర పోషించారని తెలిపారు. రాజీవ్ రైతు దీక్ష నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన విజవంతం చేయడం ఢిల్లీ కాంగ్రెస్ కు చేరిందని, అందువల్ల తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి వచ్చిందని రేవంత్ రెడ్డి తెలిపారు.

నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తెరిపిస్తామన్న హామీ ఏమైంది..?

మూతబడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ని 100రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకోలేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. అబద్దాలు చెప్పి నిజామాబాద్ లో గెలిచిన కవిత హామీలు నిలబెట్టుకోకపోవడంతో రైతులు నామినేషన్ వేసి ఓడగొట్టారని ఆయన తెలిపారు. ఇప్పుడున్న ఎంపీ అరవింద్ సైతం పసుపు బోర్డు తెస్తానని మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. సోనియాగాంధీ గురించి దురుసుగా మాట్లాడొద్దని ఎంపీ అరవింద్ కు  సూచించారు. త్వరలో గజ్వెల్, నిజామాబాద్ లో భారీ సభ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.