శ్రీరాంసాగర్ నుంచి నీటిని ఎత్తిపోసుకోమ్మని మహారాష్ట్రకు కేసీఆర్ ఆఫర్

శ్రీరాంసాగర్ నుంచి నీటిని ఎత్తిపోసుకోమ్మని మహారాష్ట్రకు కేసీఆర్ ఆఫర్

బీఆర్ఎస్​గా అవతరించిన తర్వాత కేసీఆర్​ తెలంగాణకు ఒక పెద్ద బహుమానం ప్రకటించారు.  నేను కాళేశ్వరం కట్టి తెలంగాణకు మూడేండ్ల నుంచి నీళ్లు ఇస్తున్నాను. కాబట్టి ఎస్​ఆర్ఎస్​పీ నీళ్లను మహారాష్ట్ర వాళ్లు బాబ్లీ వద్ద  పంపులు పెట్టి ఎత్తిపోసుకొమ్మని నాందేడ్​లో సెలవిచ్చారు. తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రను తెలంగాణకు ఒక బహుమానంగా ఇవ్వాలనుకుంటున్నారు! తెలంగాణ మొత్తంలో ఏకైక పెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు (ఎస్​ఆర్​ఎస్​పీ). సమారు 90 టీఎంసీల సామర్థ్యంతో 16 లక్షల 40వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. 1963లో పనులు ప్రారంభించి 1977లో ఆ ప్రాజెక్టు ఆవిష్కరించబడింది. ఇది పూర్తి గ్రావిటీ ప్రాజెక్టు. ఎత్తిపోతల ప్రాజెక్టుకాదు. కరెంటు ఖర్చు అసలే లేదు. ఇలాంటి ప్రాజెక్టు ఫోర్​షోర్​​లో పంపులు పెట్టి నీటిని తోడుకుపొమ్మని చెప్పటం ఆత్మహత్యా సదృశ్యం. ఇప్పటికే కృష్ణానది పై తెలంగాణ వాటా వాడుకోలేకపోతున్నాం.


ఇపుడు గోదావరి నీళ్లనూ పక్క రాష్ట్రానికి అప్పజెప్పేందుకు మాటలెలా వచ్చాయి? తెలంగాణలో  ఏ గొడవా లేని ప్రాజెక్టు ఇది. ఆదిలాబాద్​, నిజామాబాద్​, కరీంనగర్​, వరంగల్​, నల్గొండ, ఖమ్మం, మెదక్​ జిల్లాలు లబ్దిపొందుతున్నాయి. లక్ష్మీ, సరస్వతి, కాకతీయ మొదటి, రెండవ దశలతో పాటు, వరదకాలువ కింద 2 లక్షల ఎకరాల సాగుతో పాటు, గుత్ప, అలీసాగర్​, కింద సాగును కేసీఆర్​ గందరగోళంలో పడేయాలని కంకణం కట్టుకున్నట్లున్నారు. ప్రాజెక్టు ముందరి ఒడ్డు నుంచి ఎత్తిపోస్తే ప్రాజెక్టులో చాలా నీళ్లు వెళ్లిపోయి ఖాళీ అవుతుంది. వాస్తవంగా మహారాష్ట్ర ప్రభుత్వం జైక్వాడ్​ ప్రాజెక్టు నుంచి బాబ్లీ వరకు అనేక ప్రాజెక్టులు లిఫ్ట్​లు పెట్టి గోదావరి నీళ్లను వాడుతున్నది. దాంతో ఎస్​ఆర్​ఎస్​పీకి ఒకప్పటిలా నీళ్లు రావడంలేదు. అధిక వర్షాలు పడి మహారాష్ట్ర ప్రాజెక్టులు నిండాకనే, మనకు గోదావరి నీళ్లు వస్తాయి. అందువల్ల ఎస్​ఆర్​ఎస్పీ సెప్టెంబర్​ వరకు నిండుతుంది. జూన్​ 1 నుంచి అక్టోబర్​ 1 వరకు మాత్రమే బాబ్లీ గేట్లు తెరిచి ఉంటాయి. ఆ తదుపరి ఆ గేట్లు మూసివేస్తారు. ఇది సుప్రీంకోర్టు నిర్ణయం. నవంబర్​ నుంచి మనకు చుక్క నీరు రాదు. ఎస్​ఆర్​ఎస్పీ ప్రాజెక్టు నవంబర్​ నుంచే రెండవ పంటకు నీళ్లు వదులుతారు.

కాళేశ్వరం ఎవరి కోసం? 

ఇకపోతే, కాళేశ్వరం  మేడిగడ్డ  నుంచి మహారాష్ట్రలోని సిరోంచ వైపు పంపులు పెట్టి నీళ్లు తీసుకొమ్మని సెలవిచ్చారు.  వర్షాకాలం నీళ్లు మేడిగడ్డ నుంచి ఎత్తిపోయలేం. ఆ తర్వాత 11 టీఎంసీలే నవంబర్​ నుంచి ఎత్తిపోసే అవకాశం ఉంది. లక్ష కోట్ల పైన ఖర్చు పెట్టి ఆ నీళ్లు కూడా మహారాష్ట్ర వాళ్లను  పంపులు పెట్టి తీసుకుపొమ్మనడం తెలంగాణ రైతులను పుట్టిముంచడం కాదా?   రేపు ఆంధ్రాకు వెళ్లి కేసీఆర్​ పోతిరెడ్డిపాడు నుంచి మన నీళ్లను వెనక్కి తీసుకొస్తాడా? ఆ మాట కేసీఆర్​ నోట ఎన్నటికైనా వినగలమా? ఇంటి దొంగ లాగా  మన నీళ్లను ఇతరులకు దోచిపెట్టడం తప్ప, మన నీళ్లను మనకు కాపాడే సోయి కనిపిస్తున్నదా? ఇప్పటికే నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​ పాలమూరు ఎత్తిపోతలకు పర్యావరణ, అటవీ అనుమతులు లేవని రూ. 920 కోట్ల పెనాల్టీ వేసి పనులు ఆపేసింది. ఇది ఇంకానయమని నిధుల కొరత ఎదుర్కొంటున్న కేసీఆర్ ​సర్కార్​ సంతోషిస్తున్నది!

చాలెంజ్.. సాగుపెరగలేదు​

తెలంగాణ వచ్చే నాటికి ఉన్న సాగుకు మించి సాగు పెరిగిందే లేదు. మన నీళ్లు మందికి దోచిపెట్టడానికి కేసీఆర్​కు నోరెలా వచ్చింది? లక్షల కోట్లు ప్రాజెక్టుల పేర ఖర్చు చేశారు. కానీ వచ్చిన తెలంగాణలో సాగుభూమి మాత్రం పెరిగింది లేదని చాలెంజ్ గా​ చెపుతున్నాను. 2014 కు ముందే, తెలంగాణలో ఖరీఫ్​లో ఒక కోటి 20 లక్షల ఎకరాల్లో సాగు అవుతున్నది. నేడు కూడా అంతే సాగు అవుతున్నది. 

సాగునీటి మోసాలు చేస్తున్నది చాలదన్నట్లు..

ప్రాజెక్టులు, రీడిజైన్ల పేర రాజ్యమేలుతూ, పార్టీ పేరు మార్చుకొని పక్క రాష్ట్రాలకు నీళ్లు దోచిపెట్టడానికి వెనుకాడని కేసీఆర్​ ను ప్రజలు తప్పక తిప్పికొడతారు. పక్క రాష్ట్రాలకు మన నాళ్లు దోచిపెట్టే అధికారం కేసీఆర్​కు లేదు. కేసీఆర్​కు ప్రజలే గుణపాఠం చెపుతారు.

గ్రావిటీ నీళ్లు దానం చేసి, లిఫ్ట్​నీళ్లు మనకంటవా?   

కాళేశ్వరం కట్టాం. మాకు పుష్కలంగా నీళ్లున్నాయని చెప్పారు. కాళేశ్వరం కట్టి తెలంగాణకు లక్షల కోట్ల అప్పుచేసి చుక్కనీరు రాక, మోటార్లు కాలిపోయి తెలంగాణకు శనేశ్వరంగా మారిన ప్రాజెక్టు నుంచి మాకు నీళ్లు వస్తాయి అని తెలిపిన సీఎం కేసీఆర్​ పక్కా తెలంగాణ ద్రోహి కాక ఏమవుతారు? మనం వాడుకునే  గ్రావిటీ నీళ్లు వాళ్లకిచ్చి , లిఫ్టునీళ్లు మనకు అని చెప్పిన కేసీఆర్​ తెలంగాణకు సీఎం యేనా?  అహంకారియా? ఎస్​ఆర్​ఎస్ఫీలోకి రివర్స్​ పంపింగ్​ అని రూ. రెండువేల కోట్లు ఖర్చుచేసి  మూడు ప్రాంతాలలో లిప్ట్​లు, పంపులు పెట్టి మిడ్​మానేరు నుంచి ఎస్​ఆర్​ఎస్పీ కి చుక్కనీరు ఎత్తిపోయలేదు. అది విజయవంతం కాదని తెలిపిన ఇంజినీర్లను డీప్రమోట్ చేశారు.  ఎస్​ఆర్ఎస్పీలో నీళ్లు పుష్కలంగా ఉంటే, అదే ఎస్​ఆర్​ఎస్ఫీకి రివర్స్​ పంపింగ్​ ఎందుకు పెట్టారు?  ఒకవైపు ఎస్​ఆర్​ఎస్పీలోకి నీళ్లు ఎత్తిపోసి, ఎస్​ఆర్​ఎస్పీ గ్రావిటీ నీళ్లను మహారాష్ట్ర వాళ్లకు తీసుకుపొమ్మని చెప్పడం చూస్తే ఇంతకంటే తెలంగాణకు ద్రోహం ఇంకేముంటుంది?