
సోమవారం సభలో ప్రవేశపెట్టేది నూటికి నూరుపాళ్లు ఎన్నికల బడ్జెట్టేనని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ బడ్జెట్లో అనేక స్కీములుంటాయని, ప్రతి కుటుంబానికి అవి ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు. మంత్రులు తమ జిల్లాల్లోని ఎమ్మెల్యేలతో కలిసి ఈ పథకాలను సమర్థంగా జనంలోకి తీసుకెళ్లాలన్నారు. ఇచ్చిన హామీల్లో ముఖ్యమైనవి ఏమైనా ఉంటే వాటికి శాంక్షన్లు తీసుకోవాలని చెప్పారు. ‘రాము’ (కేటీఆర్) ఎవరు పిలిచినా జిల్లాలకు వస్తారని, ఆయనతో శంకుస్థాపనలు, ఇతర కార్యక్రమాలు ప్లాన్ చేసుకోవాలని కేసీఆర్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన అనేక హామీలకు ఈ బడ్జెట్లో స్థానం కల్పిస్తామని, దళిత బంధు ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. కేంద్రం నుంచి ఏం రావాల్సి ఉందో గుర్తించి, వాటి సాధనకు స్థానిక ప్రజలతో కలిసి ఉద్యమించాలన్నారు.
ఇయ్యాల బడ్జెట్
అసెంబ్లీ, కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్రావు, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. తర్వాత ఉభయ సభలు వాయిదా పడుతాయి. అనంతరం స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ, ప్రొటెం చైర్మన్ అధ్యక్షతన కౌన్సిల్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించి సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేదానిపై షెడ్యూల్ రూపొందిస్తారు. కనీసం పది పనిదినాలు ఉండేలా సమావేశాలు నిర్వహించే అవకాశముందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్రావు సోమవారం ఉదయం 9 గంటలకు తన నివాసం నుంచి బయల్దేరుతారని, ఫిల్మ్నగర్లోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం అసెంబ్లీకి చేరుకొని సభలో బడ్జెట్ ప్రవేశపెడుతారని ఆయన కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.