- హైదరాబాద్లో సరి- బేసి పద్ధతిలో షాపులు తెరవచ్చు
- రాష్ట్రంలోనూ ఈ కామర్స్కు ఓకే
- ఇంటర్ స్టేట్ బస్సులు నడువవు
- నైట్ కర్ఫ్యూ కంటిన్యూ అయితది
- మన దగ్గర కూడా ఈ నెల 31 దాకా లాక్డౌన్
- కరోనా ఉంటది.. బతుకు దెరువు ఉంటది
- కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో సీఎం
హైదరాబాద్, వెలుగు:రాష్ట్రాన్ని గ్రీన్ జోన్గా డిక్లేర్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కంటెయిన్మెంట్ ఏరియాల్లో తప్ప అంతటా అన్ని రకాల షాపులు, ఆఫీసులు, ఫ్యాక్టరీలు ఓపెన్ చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నట్లు చెప్పారు. మంగళవారం ఉదయం నుంచే రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వెహికల్స్ నడుస్తాయని వెల్లడించారు. అయితే.. హైదరాబాద్లో మాత్రం సిటీ బస్సులు నడువవని, మెట్రో రైళ్లకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇంటర్ స్టేట్ బస్సులకు పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పారు. కేంద్రం పొడిగించినట్లుగానే రాష్ట్రంలో కూడా ఈ నెల 31 వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందన్నారు. సోమవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. కేంద్రం ప్రకటించిన నాలుగో విడత లాక్డౌన్ అమలు, గైడ్లైన్స్, కేంద్ర ప్యాకేజీ, కొత్త వ్యవసాయ పాలసీ తదితర అంశాలపై ఇందులో చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రెస్మీట్లో మాట్లాడారు.
సెలూన్లు తీయొచ్చు..
రాష్ట్రమంతా అన్నీ షాపులు తెరుచుకోవచ్చని సీఎం చెప్పారు. కంటెయిన్మెంట్ ఏరియాల్లో మాత్రం ఆంక్షలు కంటిన్యూ అవుతాయని స్పష్టం చేశారు. హైదరాబాద్లో సరి–బేసి విధానంలో షాపులు తెరుచుకోవాల్సి ఉంటుందని, సెలూన్లు, ఈ కామర్స్ కూడా ఓపెన్ ఉంటుందన్నారు.‘‘కరోనాకు ఇప్పట్లో వ్యాక్సిన్ వచ్చే పరిస్థితి లేదు. అట్లాగని నెలలకొద్దీ అన్నీ బంద్ పెట్టి కూర్చోలేం. వైరస్తో కలిసి జీవించడం నేర్చుకోవాల్సిందే. రూల్స్ పాటిస్తూ బతుకు కొనసాగించాల్సిందే’’నని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కంటెయిన్మెంట్ ఏరియాల్లో కేవలం 1452 కుటుంబాలు ఉన్నాయని, వీళ్లందరికీ కావాల్సిన అన్నీ సేవలనూ డోర్ డెలివరీ చేస్తామని చెప్పారు. ‘‘సోమవారం ఉదయం నుంచి ఇండియా బ్యాక్ టు వర్క్ అని వస్తున్నది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పాటిస్తున్న పద్ధతులను గమనించి, మనకు అనుకూలమైన పద్ధతిలో ముందుకెళ్లాలని నిర్ణయించినం. కరోనాకు వ్యాక్సిన్ అప్పుడే వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనాతో కలిసి జీవించడం ఒక్కటే మార్గం. అన్ని జాగ్రత్తలు, నిబంధనలు పాటిస్తూ బతుకు కొనసాగించాల్సిందే. ఇక బంద్ పెట్టుకుని కూర్చోలేం. కొన్ని నిర్ణయాలు తీసుకున్నం. కంటెయిన్మెంట్ ఏరియాల్లో తప్ప అన్ని చోట్ల అన్ని షాపులూ తెరుచుకోవచ్చు. వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు. హైదరాబాద్లో సరి– బేసి పద్ధతిలో, ఆల్టర్నేటీవ్ డేస్లో షాపులు తెరుచుకోవచ్చు. కంటెయిన్మెంట్ ఏరియాల్లో మాత్రం అన్నీ బంద్ ఉంటయి. ఆ ఏరియాల్లోకి ఈగ, దోమను కూడా పోనియ్యం”అని సీఎం పేర్కొన్నారు.
బస్సులు నడుస్తయ్
‘‘రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు మంగళవారం పొద్దున 6 గంటల నుంచి స్టార్ట్ అవుతయి. మన రాష్ట్ర బస్సులను ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లినవ్వం. ఇతర రాష్ట్రాల బస్సులను మన రాష్ట్రంలోకి రానివ్వం. ఇంటర్ స్టేట్ బస్సులు ఉండవు. పక్కనున్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నయి. అందుకే ఇంటర్ స్టేట్ బస్సులకు అనుమతిస్తలేం”అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో సిటీ బస్సులు నడువవని, ఇద్దరు ప్రయాణికులతో ఆటోలు, ముగ్గురు ప్రయాణికులతో క్యాబ్లు నడుపుకోవచ్చన్నారు. అంతకంటే ఎక్కువ ఎక్కిస్తే చలాన్లు పడుతాయని హెచ్చరించారు. ‘‘జిల్లాల నుంచి హైదరాబాద్కు బస్సులు వస్తయి. అవి ఇంబ్లీబన్ బస్టాండ్కు రానీయరు. జూబ్లీ బస్ దాకనే వస్తయి. దిల్సుఖ్ నగర్ సైడ్ రానియ్యరు. ఎల్బీనగర్ సైడ్ రానీయరు. మ్యాగ్జిమం బస్సులు రాత్రి 7 గంటల్లోపనే విత్డ్రా కావాలి. కొన్ని బస్సులు ఒక గంట ఎక్కువైనా అనుమతిస్తరు. 99 శాతం 7 గంటల వరకేల ఏదైనా క్లోజ్ చేసుకుంటే మంచిది. ప్రైవేటు సర్వీసులు, ఓన్ వెహికల్స్ అన్నీ అలో చేస్తున్నం” అని స్పష్టం చేశారు.
సెలూన్లు ఓపెన్.. ఆఫీసులు 100% పనిచేయొచ్చు
రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లు తెరుచుకోవచ్చని, ఈ కామర్స్ అన్నీ నడుపుకోవచ్చని, ఎలాంటి ఆంక్షలు లేవని సీఎం చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసులు 100శాతం స్టాఫ్తో నడుపుకోవచ్చని వివరించారు. రూల్స్ పాటిస్తూ పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మానుఫాక్చరింగ్ యూనిట్లు వంద శాతం పనిచేసుకోవచ్చన్నారు
స్కూళ్లు, కాలేజీలూ క్లోజ్
రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుందని సీఎం చెప్పారు. ‘‘అన్ని మతాల ప్రార్థనా మందిరాలు బంద్ ఉంటయి. మతపరమైన ఉత్సవాలకు కూడా అనుమతిలేదు. ఫంక్షన్ హాల్స్, మాల్స్, సినిమాహాళ్లకు కూడా అనుమతిలేదు. సభలు, ర్యాలీలు, సమావేశాలు కూడా బంద్ ఉంటయ్. అన్ని రకాల విద్యా సంస్థలు కూడా బంద్ పాటించాల్సిందే. బార్లు, పబ్స్, క్లబ్బులు, స్టేడియాలు, జిమ్లు, స్విమ్మింగ్ పూల్స్, పార్కులు కూడా బంద్ ఉంటయ్. మెట్రో రైల్ కూడా బందే ఉంటది. దయచేసి ప్రతి ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాలె. లేదంటే వెయ్యి రూపాయలు ఫైన్ పడ్తది” అని అన్నారు.
వృద్ధులు, పిల్లలూ జాగ్రత్త
అవసరముంటే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ‘‘అందరూ బయటకొచ్చి, ఒకవేళ వైరస్ తిరగబెడితే మళ్లీ లాక్డౌన్ పెట్టాల్సి వస్తుంది” అని అన్నారు. అత్యవసరమైతే తప్ప 65ఏండ్లు పైబడిన వృద్ధులను, పిల్లలను బయటకు రానీయొద్దని సూచించారు. వాళ్లను కుటుంబ సభ్యులే కాపాడుకోవాలన్నారు. ఇప్పటివరకూ లాక్డౌన్కు ప్రజలు చాలా సహకరించారని, వారందరికీ చేతులెత్తి దండం పెడుతున్నానని చెప్పారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్లోనూ ఇబ్బందులు ఉండవన్నారు.

