
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఎప్పుడు అనే దానిపై టీఆర్ఎస్ నేతల్లో విస్తృత చర్చ జరుగుతోంది. దసరా రోజే జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, దానికి మూడ్రోజుల ముందే గాంధీ జయంతి సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. అక్టోబర్ 2న గాంధీ ఆస్పత్రి ఎదుట గాంధీ విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలోనే జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నానని కేసీఆర్ ఏడాదిన్నరగా చెబుతూ వస్తున్నారు. 6 నెలలుగా పార్టీ ఏర్పాటు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. 25 రాష్ట్రాల రైతుల సమావేశంలోనూ ఈ మేరకు స్పష్టత ఇచ్చారు. పలు పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల సీఎంలతో కేసీఆర్ సమావేశమయ్యారు. డిసెంబర్ లో పార్టీ ప్రకటన ఉండొచ్చని కొన్ని రోజుల క్రితం లీకులు ఇచ్చారు. ఇప్పుడు గాంధీ జయంతి లేదా దసరాకే పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.
వారం రోజులుగా కేసీఆర్ కసరత్తు
జాతీయ పార్టీకి సంబంధించిన విధివిధానాలపై వారం రోజులుగా ఫామ్ హౌస్లో కేసీఆర్ కసరత్తు చేశారు. పార్టీ ఏర్పాటుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని తెలిసింది. ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్ నాయకుడు ఢిల్లీలో దీనికి సంబంధించిన పనులు చేస్తున్నారు. మంగళవారం రాత్రి సదరు నేతతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. జాతీయ పార్టీ పేరు, కారు గుర్తును క్యారీ ఫార్వర్డ్ చేయడానికి సంబంధించిన ప్రక్రియ సహా ఇతర అంశాలపై వారు చర్చించినట్టుగా తెలిసింది.
జాతీయ రాజకీయాల్లో బీజేపీకి సరైన ప్రత్యామ్నాయం లేకపోవడం, కాంగ్రెస్ బలమైన పొలిటికల్ ఫోర్స్గా ఎమర్జ్ కాలేకపోతుండటంతో జాతీయ రాజకీయాల్లో అవసరమైనంత స్పేస్ ఉందని, జాతీయ పార్టీ ప్రకటనకు ఇదే సరైన సమయమని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీ పేరు మారినా కేసీఆర్ గుర్తు కారు అన్నది ప్రజలందరికీ తెలుసని, అలాంటప్పుడు పార్టీ పేరులో తెలంగాణ లేకున్నా ఇబ్బంది ఏముండదనేది ఆయన భావనగా సమాచారం. టీఆర్ఎస్ను కొనసాగిస్తూనే వేరే పేరుతో జాతీయ పార్టీ పెట్టాలని కొందరు సూచించినా రెండు పార్టీలు నిర్వహించడం సాధ్యం కాదనే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.